తెలంగాణలో పదేళ్లు పవర్లో కాంగ్రెస్సే: MLC మహేష్ కుమార్ గౌడ్
కాంగ్రెస్ ఇప్పుడు న్యూ వర్షన్లో ముందుకు వెళ్తుందని ఎమ్మెల్సీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఇప్పుడు న్యూ వర్షన్లో ముందుకు వెళ్తుందని ఎమ్మెల్సీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం గాంధీభవన్లో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన ప్రతి నేతకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పదేళ్లు పవర్లో ఉంటామని, అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. విడతల వారీగా అవకాశాలు కల్పిస్తూనే పార్టీని, ప్రజలను కాపాడుకుంటామన్నారు. పదవుల్లో యువతకే అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, సీఎం రేవంత్ రెడ్డికి ఓ విజన్ ఉన్నదని, పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూస్తారని భరోసా ఇచ్చారు. గడిచిన పదేళ్లుగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని, వందల మంది కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదైనా, ప్రజల కోసం వెనకడుగు వేయలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిందని, యువ నాయకత్వానికి పెద్ద పీఠ వేసేందుకు పార్టీ సుముఖంగా ఉన్నదన్నారు.