'అంతా మేమే అంటే ఊరుకునే ప్రసక్తే లేదు'.. చిహ్నం మార్పుపై బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కౌంటర్

చిహ్నం మార్పుపై బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.

Update: 2024-05-29 12:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రాజకీయం రంజుగా సాగుతుంటే తెలంగాణలో మాత్రం రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గేయం మార్పుపై రాజకీయం హాట్ హాట్ గా మారుతోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న చిహ్నం, గేయాన్ని ఆవిష్కరించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ మొదలైంది. ఈ క్రమంలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. తన అధికారిక ట్విట్టర్ లో చిహ్నం విషయంలో స్పందిస్తూ లోగోను ఎందుకు మార్చాల్సి వస్తోందో వివరించింది.

వాళ్ల ఆనవాళ్లకు పట్టం కడతాం:

పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పై ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోని అణువణువు అమరుల త్యాగాల ఆనవాళ్లే. కానీ ఆ ఆనవాళ్లు మచ్చుకైనా లేని ముద్ర తెలంగాణకు రాజముద్ర ఎలా అవ్వగలదు అని ప్రశ్నించింది. 'రాజ్యం తెచ్చిన నిజమైన రాజులు ఎవరయ్యా అంటే మన తెలంగాణ అమరవీరులు. వారి ఉనికిని ప్రశ్నార్థకం చేసి, రాజ్యం ఏలే రాజులు.. మేమే తెలంగాణకు సర్వం.. సర్వస్వం అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది ప్రజా తెలంగాణ.. ఇక్కడ ప్రస్తుతం నడుస్తుంది ప్రజాపాలన. ప్రజా పాలనలో ప్రజలే మాకు దేవుళ్ళు.. వారి త్యాగాలే మాకు ఆనవాళ్ళు. ఆ ఆనవాళ్ళకు పట్టం కడుతూ మన రాజముద్రను వారి ఆశయాలకు అనుగుణంగా మార్చబోతున్నాం.' అని ప్రకటించింది. అలాగే జాతీయ సమగ్రత ప్రజ్వరిల్లేలా.. తెలంగాణ ప్రాభవం ఉట్టిపడేలా… ఉద్యమ ఉనికి కళ్ళకు కట్టేలా… ప్రతి తెలంగాణ పౌరుడు ఇది మన రాష్ట్రం అనుకునేలా మన రాజముద్ర ఉండాలనేది ఈ ప్రజా ప్రభుత్వ సంకల్పం అని పేర్కొంది.

Tags:    

Similar News