దశాబ్ది ఉత్సవాలు కలిసి వచ్చేదెవరికి? బెడిసికొట్టేదెవరికి?

తెలంగాణ రాజకీయం రాష్ట్ర అవతరణ ఉత్సవాల చుట్టూ తిరుగుతోంది. ఎన్నికలకు ముందు ఇదే చివరి అవతరణ ఉత్సవాలు కావడంతో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రధాన పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా నడుస్తోంది.

Update: 2023-06-01 13:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయం రాష్ట్ర అవతరణ ఉత్సవాల చుట్టూ తిరుగుతోంది. ఎన్నికలకు ముందు ఇదే చివరి అవతరణ ఉత్సవాలు కావడంతో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రధాన పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా నడుస్తోంది. తెలంగాణ క్రెడిట్‌ను కొట్టేసేందుకు అధికార బీఆర్ఎస్‌తో బీజేపీ, కాంగ్రెస్ వ్యూహా రచన చేస్తున్నాయి. దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైతే గతానికి భిన్నంగా ఈ సారి కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సిద్ధమైంది. ఈ రెండు పార్టీలకు షాకిచ్చే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రత్యేక కార్యచరణతో ప్రజల్లోకి వెళ్తోంది. దీంతో రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఎవరి పండగ వారిదే అన్నట్లుగా సీన్ మారిపోయింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సెక్రటేరియట్ వద్ద రేపటి ఆవిర్భావ వేడుకల కోసం ఏర్పాట్లు పూర్తవుతుండగా కేద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గొల్కొండ కోటలో నిర్వహించబోతున్న వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు.

తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంటే తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ ముందుండి నడిపిందనే విషయాన్ని బీజేపీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. గోల్కొండ కోటలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. రాష్ట్ర ఏర్పాటులో బీజీపీ తోడ్పాటు ఉందని సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తాము తెలంగాణ కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలుపుతుంటే తమపై కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు లాఠీ ఛార్జ్ చేయించిందని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అవతరణ వేడుకలు తొలుత ప్రియాంక గాంధీ వస్తారనే ప్రచారం జరిగినా అనూహ్యంగా ఈ వేడుకలకు మాజీ లోక్ సభ స్పీకర్ మీరాకుమారి వస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన సమయంలో లోక్ సభ స్పీకర్ గా మీరాకుమారినే ఉన్నారు. సభలో గందరగోళ పరిస్థితి ఉన్నా బిల్ ఆమోదం పొందడానికి మీరా కుమారి సహకరించారనే విషయాన్ని టీ కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంగా తెలుస్తోంది. అంతే కాదు రేపటి నుంచి 20 రోజుల పాటు ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ టీపీసీసీ వివిధ కార్యక్రమాలను రూపొందించడం హాట్ టాపిక్‌గా మారింది.

సెంటిమెంట్‌ను సొంతం చేసుకునేలా:

రాష్ట్ర అవతరణ వేడుకల విషయంలో బీఆర్ఎస్, బేజేపీ, కాంగ్రెస్ మధ్య సెంటిమెంట్ సొంతం చేసుకునేందుకు ఎవరికి వారు విస్తృత ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరో ఐదు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్నందున ఈ వేడుకల ద్వారా లబ్ధి పొందేందుకు ఈ మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే గతేడాది వరకు తెలంగాణ ఇంటి పార్టీగా టీఆర్ఎస్ మిగిలిన పార్టీలపై పైచేయి సాధించినా ఈ ఏడాది బీఆర్ఎస్ గా మారడంతో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇన్నాళ్లు కేసీఆర్ ఏ సెంటిమెంట్ తో పాలిటిక్స్ నడిపించారో అదే సెంటిమెంట్ ను మిగతా పార్టీలు సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ గతానికి భిన్నంగా ప్రధాన పార్టీలు ఆవిర్భవ వేడుకలపై ఫోకస్ పెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. ఇంతకీ ఈ సెంటిమెంట్ ప్రయత్నం ఎవరికి కలిసివస్తుంది మరెవరికి బెడిసికొడుతుంది అనేది ప్రజలే నిర్ణయించనున్నారు.

Read More...   బాధతో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం: బండి సంజయ్ 

ఆవిర్భావ వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

Tags:    

Similar News