‘రైతులకు అన్యాయం జరగొద్దు’.. అధికారులకు CM రేవంత్ కీలక సూచన

రాష్ట్రంలో రీజినల్ రింగు రోడ్డు సహా పలు జాతీయ రహదారుల నిర్మాణం సమయంలో అవసరమైన భూసేకరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

Update: 2024-07-10 17:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రీజినల్ రింగు రోడ్డు సహా పలు జాతీయ రహదారుల నిర్మాణం సమయంలో అవసరమైన భూసేకరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రివ్యూ సందర్భంగా రైతుల భూములను సేకరించినప్పుడు వారికి పరిహారంగా న్యాయమైన ధర చెల్లించాలన్నారు. మానవీయ కోణంలో అధికారులు వ్యవహరించాలన్నారు. జిల్లాల కలెక్టర్లే నేరుగా రైతులతో మాట్లాడి ధరను ఫైనల్ చేయాలన్నారు. నిబంధనల ప్రకారం వీలైనంత ఎక్కువగా వారికి పరిహారం లభించేలా చూడాలన్నారు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువ ఉండడం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని ఈ సమావేశంలో కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. తరతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారనే విషయాన్ని గమనంలోకి తీసుకుని కలెక్టర్లే రైతులతో మాట్లాడి ఒప్పించాలని సూచించారు.

రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలపై నేషనల్ హైవే అథారిటీ రీజినల్ కార్యాలయ అధికారులతో సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించి పనుల పురోగతిపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నప్పటికీ భూ సేకరణలో ఎందుకు ఆలస్యమవుతోందని ఆరాతీశారు. రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగం, ఉత్తర భాగాలను వేర్వేరుగా చూడొద్దని, రెండింటికీ కలిపి ఒకే నెంబర్‌ను కేటాయించాలని నొక్కిచెప్పారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఇదే విషయాన్ని చర్చించామని, ఆయన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. దానికి తగినట్లుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్ఏఐ అధికారులకు సూచించారు.

రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు ఎన్‌హెచ్ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. ఆ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సంబంధిత రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో భూసేకరణకు ఎదురవుతున్న ఆటంకాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. అలైన్‌మెంట్ విషయంలో కొందరు రైతులు ఆందోళనతో కోర్టును ఆశ్రయించారని, దీన్ని విచారించిన హైకోర్టు స్టే మంజూరు చేసిందంటూ భువనగిరి కలెక్టర్ హన్మంత్ జెండగే ఈ సమావేశంలో సీఎం దృష్టికి తీసుకెళ్ళారు. ఆ మధ్యంతర నిలుపుదల ఉత్తర్వులను తొలగించేలా శుక్రవారం నాటికి కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కలెక్టర్‌కు ముఖ్యమంత్రి సూచించారు.

నాగ్‌పూర్-విజయవాడ కారిడార్‌లో ఖమ్మం జిల్లాలో భూ సేకరణ పరిస్థితిపై అధికారులను ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం సమీపంలోని విలువైన భూములమీదుగా రహదారి పోతున్నందున పరిహారం విషయంలో రైతులను ఒప్పిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై సీఎంకు తెలిపారు. తల్లాడ-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ రహదారి పనులు సాగుతున్నందున, ప్రస్తుతం ఖమ్మం నుంచి అశ్వారావుపేట వరకు ఉన్న జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చుకోవాలని ఎన్‌హెచ్ఏఐ అధికారులు సూచిస్తున్నారని, కానీ దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని, జాతీయ రహదారిగానే దానిని కొనసాగించాలని మంత్రి తుమ్మల అభిప్రాయం వ్యక్తంచేశారు.

ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై.. నాగ్‌పూర్-విజయవాడ కారిడార్‌లో భాగంగా నిర్మిస్తున్న రహదారిలో పెద్ద గ్రామాలున్నచోట సర్వీసు రోడ్లను నిర్మించాలని, రైతులు పొలాలకు వెళ్లేందుకు వీలుగా అవసరమైన చోట్ల అండర్ పాస్‌లు నిర్మించాలని ఎన్‌హెచ్ఏఐ అధికారులను కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామంటూ ఎన్‌హెచ్ఏఐ ప్రాజెక్టు సభ్యుడు అనిల్ చౌదరి బదులిచ్చారు. జాతీయ రహదారుల వెంట వ్యవసాయ వాహనాలు, రైతులు వినియోగించుకునేలా గ్రావెల్‌ రోడ్లు నిర్మించాలనే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. గ్రావెల్ రహదారి నిర్మించడం వలన రైతులకు ఉపయోగపడడంతో పాటు భవిష్యత్తులో రహదారి విస్తరణకు ఇబ్బందులు ఉండవని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల, విజయవాడ-నాగ్‌పూర్ కారిడార్ రహదారులకు సంబంధించి అటవీ శాఖ భూముల బదలాయింపుపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం భూములు ఇస్తుందని, ఆ దిశగా చొరవ తీసుకోవాలని నిజామాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లకు సూచించారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. ప్రభుత్వ భూములను అటవీ శాఖకు బదలాయించి వారి భూములను తీసుకొని రహదారుల నిర్మాణానికి ఉన్న ఆటంకాలను తొలగించాలని నొక్కిచెప్పారు. వివిధ శాఖ‌ల ప‌రిధిలోని యుటిలిటీస్ తొలగింపునకు సంబంధించి చెల్లింపులు వేగవంతం చేయాలని, ఏవైనా సమస్యలుంటే ఎన్‌హెచ్ఏఐతో సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు.

= హైదరాబాద్-మన్నెగూడ రహదారి పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాల‌ని సంబంధిత అధికారుల‌కు ముఖ్యమంత్రి సూచించారు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సైతం అంగీక‌రించారు.

= రెండు నెలల్లో హైదరాబాద్-విజయవాడ విస్తరణ పనులు (సిక్స్ లైన్) భూ సేకరణ పూర్తయినందున వెంటనే పనులు చేపట్టాలని ఈ సమావేశంలో పాల్గొన్న ఎన్‌హెచ్ఏఐ ప్రాజెక్టు మెంబర్ అనిల్ చౌదరిని రోడ్లు-భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శేషాద్రి, సీఎంవో అధికారులు మాణిక్‌రాజ్, చంద్రశేఖర్ రెడ్డి, షానవాజ్ ఖాసిం, మౌలిక వసతుల సలహాదారు శ్రీనివాసరాజు, ఎన్‌హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి రజాక్, పీసీసీఎఫ్ డోబ్రియల్, రోడ్లు-భవనాల శాఖ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, జాయింట్ సెక్రెటరీ హరీష్, మెదక్, భువనగిరి, సంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


Similar News