CM Revanth : పర్యాటకులకు సీఎం గుడ్ న్యూస్.. హుస్సేన్ సాగర్ చుట్టూరా స్కై వాక్ వే.. మరెన్నో

హైదరాబాద్​ హుస్సేన్​సాగర్​ బుద్ధ విగ్రహం చుట్టూ టూరిజం డెస్టినేషన్​ సర్కిల్​ గా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిచింది.

Update: 2024-08-31 13:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో బౌద్ధ పర్యాటక స్థలాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్​ హుస్సేన్​సాగర్​ బుద్ధ విగ్రహం చుట్టూ టూరిజం డెస్టినేషన్​ సర్కిల్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయిచింది. ట్యాంక్​ బండ్​, తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్​ రోడ్డు, సంజీవయ్య పార్కు వరకు వలయాకారంలో స్కై వాక్ వే డిజైన్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఉన్న బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్యాంక్​ బండ్​ ప్రాంతాన్ని భవిష్యత్తులో వరల్డ్ క్లాస్ టూరిజం హబ్ గా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అనుభవమున్న కన్సల్టెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ స్థాయి నమూన డిజైన్లు తయారు చేయించాలన్నారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్​ కోర్టులు, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని సిటీలో సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

దేశ విదేశాల్లోని బుద్దిస్టులను ఆకట్టుకునేలా బుద్ధవనంలో ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియం నెలకొల్పే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. కొత్త టూరిజం పాలసీ లో భాగంగా తెలంగాణలో చారిత్రకంగా పేరొందిన ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ద క్షేత్రాలతో పాటు హుస్సేన్​ సాగర్​లో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. కేంద్రం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్​లో భాగంగా బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్‌ను పంపించిందని తెలిపారు. రూ.25 కోట్ల అంచనాలతో బుద్ధవనంలో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కివ్స్ ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించిందన్నారు. వీటితో పాటు తాజాగా ఇంటర్నేషనల్​ బుద్ధ మ్యూజియం ను ఈ ప్రణాళిక లో పొందుపరచనుందని తెలిపారు. ఇందులో భాగంగా నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని టూరిజం, స్పిర్చువల్ డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దుతారు.

హైదరాబాద్- నాగార్జున సాగర్ ఫోర్ లేన్ రోడ్

నాగార్జున సాగర్ డ్యామ్​ అందాలతో పాటు పరిసరాల్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా అభివృద్ధి చేయాలని సీఎం సంకల్పించారు. నాగార్జున సాగర్​ సందర్శనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్ వాటర్ వరకు బోట్ లో విహారించే ఏర్పాట్లు పునరుద్ధరించాలని నిర్ణయించారు. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆకర్షించేందుకు అనువైన టూరిజం ప్యాకేజీలు రూపొందిస్తారని తెలిపారు. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు ఫోర్ లేన్ రోడ్ నిర్మిస్తారు. ఈ రహదారి కి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను సీఎం ఆదేశించారు.

గోల్కొండ చుట్టూ అక్రమ నిర్మాణలు తొలగింపు

అదేవిధంగా గోల్కొండ చుట్టూ ఉన్న రోడ్లన్నీ ఇరుకుగా అయ్యాయని, వాటిని విశాలంగా అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. ఆక్రమణలుంటే తొలగించాలని, అక్కడున్న ఇండ్ల వాసులు, దుకాణదారులు నిరాశ్రయులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వారికి మరో చోట పునరావాసం కల్పించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


Similar News