పదేళ్లు కాంగ్రెస్ అందుకే అధికారం కోల్పోయింది.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయం దండగ కాదు, పండగ అని నిరూపించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-15 11:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయం దండగ కాదు, పండగ అని నిరూపించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను నమ్మే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారని అన్నారు. రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పాం.. చేసి చూపించామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచినట్లు గుర్తుచేశారు.

‘తెలంగాణ ఇచ్చినప్పటికీ రెండు పర్యాయాలు కాంగ్రెస్‌కు అధికారం దక్కలేదు. వేర్వేరు కారణాలతో అధికారంలోకి రాలేకపోయింది. పీసీసీ అధ్యక్షుడిగా నేను 38 నెలలు ప్రజల తరపున పోరాటం చేశాను. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని అన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే.. తప్పక జరిగి తీరుతుందని నిరూపించాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే హామీలు అమలు ప్రారంభించాం’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహేశ్ గౌడ్ నేతృత్వరంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.


Similar News