రుణమాఫీ విషయంలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం అని సీఎం అన్నారు.

Update: 2024-07-17 11:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్ ను దేశం అనుసరించేలా ఉండాలని, ఈ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రతి రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అందువల్లే రుణమాఫీ విషయంలో కేసీఆర్ మాదిరిగా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడం లేదనన్నారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని అందుకే ఏక మొత్తంలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామన్నారు. మనం చేస్తున్న ఈ మంచి పనిని ప్రజలకు వివరించాలని గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చాటి చెప్పాలని పార్టీ నేతలకు సూచించారు.బుధవారం ప్రజాభవన్ లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు.

కష్టమని చెప్పినా..

వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామని లోక్ సభ ఎన్నికల ప్రచారంలో చెప్పాం. రుణమాఫీ కష్టం అని, దీని ద్వారా ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెప్పారు. కానీ రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతున్నామన్నారు. రుణమాఫీపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని, రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారెంటీని అమలు చేశామని పార్లమెంట్ లో ఎంపీలు ప్రస్తావించాలని సూచించారు. రేపు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలని, ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణంలో సంబరాలు జరపాలన్నారు. నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని సీఎం చెప్పారు.

గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం:

పదేళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ రూ.28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని ఈ సందర్భంగా సీఎం ధ్వజమెత్తారు. ఏడు నెలల్లో మన ప్రభుత్వం సంక్షేమానికి రూ.30వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం. రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31వేల కోట్లతో రుణమాఫీ చేయలేదని చెప్పారు. రేపు సాయంత్రం 4గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతురుణాలు మాఫీ చేస్తున్నామని, రూ.7వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళతాయన్నారు. నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామని, ఆగస్టు లో రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేసి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు.


Similar News