Charles Schwab: తెలంగాణకు మరో పెట్టుబడి.. రేవంత్ రెడ్డితో ఛార్లెస్ స్క్వాబ్ ప్రతినిధుల భేటీ

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రతిష్టాత్మక సంస్థ ముందుకు వచ్చింది.

Update: 2024-08-08 07:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వివిధ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి కనపరుస్తున్నాయి. తాజాగా ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్​మెంట్ ​సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్ లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్‌ ఇదే కావటం విశేషం. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ ​బాబుతో చార్లెస్ స్క్వాబ్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు డెన్నిస్ హోవార్డ్, రామ బొక్కా సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవెలప్​మెంట్​ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు. తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుకు ఛార్లెస్ స్క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్ కు పంపించనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.

డల్లాస్ లో మహాత్ముడి విగ్రహానికి సీఎం నివాళి:

డల్లాస్‌ నగరంలోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రి వర్గ సహచరులు డి.శ్రీధర్ బాబు, కోమటిరెడ్డిలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి సీఎం నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మహాత్ముడి సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. కాగా డల్లాస్ లో ఏర్పాటు చేసిన ఈ గాంధీ విగ్రహం అమెరికాలోనే అతి పెద్దది కావడం విశేషం.

Tags:    

Similar News