ఢిల్లీకి చేరిన తెలుగు పాలిటిక్స్.. హాట్ టాపిక్ గా ఒకే రోజు మోడీ వద్దకు చంద్రబాబు, రేవంత్

రెండు తెలుగు రాష్ట్రా రాజకీయాలు హస్తినకు చేరాయి.

Update: 2024-07-04 07:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయం ఢిల్లీకి చేరుకుంది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే సమయంలో హస్తినలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ కాగా మధ్యాహ్నం 1:30 గంటలకు రేవంత్ పీఎంను కలవబోతున్నారు. అయితే ఈ నెల 6వ తేదీన రేవంత్ రెడ్డి, చంద్రబాబు హైదరాబాద్ వేదికగా భేటీ కాబోతున్నారు. ఈ భేటీకి సరిగ్గా రెండురోజుల ముందు ఇరువురు ముఖ్యమంత్రులు ప్రధానితో వేర్వేరుగా సమావేశం కాబోతుండటం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను పీఎంకు వివరించి పెండింగ్ నిధులను విడుదల చేయాలని ప్రధానిని కోరుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో తమ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా ముఖ్యమంత్రులు ప్రధానితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఓ వైపు చంద్రబాబు, రేవంత్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ గురుశిష్యుల బంధాన్ని తెరపైకి తీసుకువస్తున్న వేళ తెలంగాణ సీఎం అనూహ్యంగా బాబు టూర్ సమయంలోనే తానూ హస్తినలో పర్యటించడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.

అమిత్ షాతో రేవంత్, భట్టి సమావేశం..

నరేంద్ర మోడీతో భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో గతవారమే పలువురు కేంద్ర మంత్రులను సీఎం, డిప్యూటీ సీఎం కలిసి తెలంగాణ సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. నిధులు కేటాయించాలని కోరారు. ఈ టూర్‌లో భాగంగా మరికొంతమంది కేంద్ర మంత్రులతోనూ ఇరువురు భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది.

చివరి దశకు టీపీసీసీ చీఫ్ కసరత్తు..

మరోవైపు మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ చీఫ్ ఎంపిక అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. బుధవారమే ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించారు. ఇదే అంశంలో ఇవాళ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతోనూ అధిష్టానం చర్చలు జరపబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ ఉదయమే భట్టి ఢిల్లీకి చేరుకున్నారు. వీలైనంత త్వరగా కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపిక పూర్తి చేయాలని కోరే అవకాశం ఉంది.

Tags:    

Similar News