రైతులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఆ భూములకు పంట పెట్టుబడి సాయం బంద్..!

గత ప్రభుత్వంలో కొండలు, గుట్టలు, రోడ్లు, బిల్డింగులు.. ఇలా నిర్దిష్ట విధానం లేకుండా రైతుబంధు పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం

Update: 2024-07-05 17:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వంలో కొండలు, గుట్టలు, రోడ్లు, బిల్డింగులు.. ఇలా నిర్దిష్ట విధానం లేకుండా రైతుబంధు పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తున్న ప్రభుత్వం.. ఈసారి రైతుభరోసా స్కీమ్‌కు స్పష్టమైన మార్గదర్శకాల తయారీపై దృష్టి పెట్టింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో నలుగురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో తొలి సమావేశం నిర్వహించింది. సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా పేరుతో ప్రభుత్వం సాయాన్ని అందించాలని, సాగులో లేని భూములకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిన అవసరం లేదనే చర్చ జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటివరకు రైతుబంధు పేరుతో ఇచ్చిన నిధుల వివరాలను ఈ కమిటీకి సమర్పించడంతో పాటు రైతులకు సాగుభూమి విస్తీర్ణం ఏ మేరకు ఉన్నదో బ్రేకప్ వివరాలను అందించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేబినెట్ సబ్ కమిటీ ఎంత భూమి ఉన్నా ఐదు ఎకరాలకు మాత్రమే సాయాన్ని అందించాలనే కటాఫ్ సీలింగ్ విధించడంపై చర్చించింది.

కౌలు రైతులకు సైతం రైతు భరోసా పథకం ద్వారా సాయం అందిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్లుగానే తగిన మార్గదర్శకాల తయారీపై ఫోకస్ పెట్టిన ఈ కమిటీ.. విధివిధానాలను ఏ తరహాలో రూపొందించాలో ఆలోచిస్తున్నది. రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో 92% మందికి ఐదు ఎకరాల లోపు మాత్రమే వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారుల వివరాల ద్వారా స్పష్టత వచ్చింది. దీంతో గరిష్టంగా ఐదెకరాల వరకు మాత్రమే సాయాన్ని అందించాలని ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఇక కౌలు రైతుల విషయంలో భూ యజమానితో కౌలుకు తీసుకున్నట్లు అగ్రిమెంట్ కుదుర్చుకోవాలని, దానికి అనుగుణంగానే కౌలు రైతులకు సైతం సాయం అందించడం సాధ్యమవుతుందనే చర్చ జరిగింది. రైతుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకునేలా ఈ నెల 11-16 తేదీల మధ్య జిల్లా మంత్రులు రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో రోజుకు మూడు సమావేశాల చొప్పున చర్చించాలని కమిటీ ఒక స్పష్టతకు వచ్చింది.

గత ప్రభుత్వంలో సాగులో లేని భూములకు కూడా రైతుబంధు పేరుతో ఆర్థిక సాయం చేసినందున దాదాపు రూ. 26 వేల కోట్లు వృథా అయినట్లు గణాంకాల ద్వారా ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. ఈసారి అలాంటి విధానం రిపీట్ కాకూడదన్న ఉద్దేశంతోనే కేబినెట్ సబ్ కమిటీ లోతుగా చర్చిస్తున్నది. తొలి సమావేశంలో పలు అంశాలను చర్చించి ఈ నెల 16 తర్వాత మరోసారి భేటీ కావాలనే నిర్ణయం తీసుకున్నది. కౌలు రైతులను గుర్తించడంపైనే ఈ సమావేశంలో లోతుగా చర్చ జరిగింది. ప్రస్తుతం ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తుండగా ఇకపైన కూడా ఇదే విధానాన్ని కొనసాగించడమా?.. లేక ప్రత్యామ్నాయంగా మరో విధానాన్ని ఎంచుకోవడమా?.. అనే అంశంపై కూడా ఈ సమావేశంలో నలుగురు మంత్రులు, అధికారులు చర్చించారు. ప్రజాధనం వినియోగం సంపూర్ణమైన ఫలితాలు ఇచ్చేలా, లబ్ధిదారులకు నిజమైన ప్రయోజనం కలిగేలా కచ్చితంగా సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసాను వర్తింప జేయాలని ప్రాథమిక అంచనాకు వచ్చింది.

చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే లబ్ధి కలిగేలా మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు తెలిసింది. సాగులో లేని భూములను జాబితా నుంచి తొలగించేలా వ్యవసాయ శాఖను ఆదేశించనున్నది. కౌలు రైతులకు అగ్రిమెంట్ అనే అంశాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నందున దానితో వచ్చే లీగల్ చిక్కులపైనా ఈ కమిటీ చర్చించింది. రైతుల అభిప్రాయాను ఈ నెల 16కల్లా సేకరించిన తర్వాత వాటిని తదుపరి సమావేశంలో చర్చించి స్పష్టతకు రావాలని కమిటీ అభిప్రాయపడింది. ఈ మార్గదర్శకాలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చర్చకు పెట్టి సభ్యులందరి స్పందనకు అనుగుణంగా విధాన నిర్ణయం తీసుకోనున్నది.


Similar News