మూసీ ప్రక్షాళన ప్రారంభించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం : జగదీశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

మూసీ సుందరీకరణపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-08 08:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ సుందరీకరణపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మూసీ నీళ్లను మురికి నీళ్లుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని ఫైర్ అయ్యారు. మూసీ ప్రక్షాళన పనులు ప్రారంభించింది బీఆర్ఎస్ ప్రభుత్వమని, రూ. 16,500 కోట్ల పనులకు డీపీఆర్ కూడా తయారు చేశామని జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఫ్లోరోసిస్ ను రూపుమాపి.. త్రాగునీరు అందించామని అన్నారు. హైడ్రా, మూసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురి అయిందన్నారు.

బడే భాయ్ నోట్ల రద్దుతో ఏం తప్పు చేశారో ఇక్కడ చోటా భాయ్ హైడ్రా విషయంలో తప్పు చేశారని ఆయన సెటైర్లు వేశారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు మూసీ సుందరీకరణ అంటున్నారని, రేవంత్‌రెడ్డి తాబేదార్ల కోసం హైడ్రా, మూసీ వచ్చిందన్నారు. మీ చేతికి అధికారం వచ్చాక ఏం జరిగిందో చర్చకు రెడీనా అంటూ ఉప ముఖ్యమంత్రి భట్టికి సవాల్ చేశారు. అబద్దాలు చెప్పడంలో భట్టి సీఎం రేవంత్ రెడ్డిని మించిపోతున్నారని విమర్శించారు. డబ్బులు సంపాదించడంలో భట్టి సీఎంతో పోటీ పడుతున్నారని ఆరోపించారు. మూసీపై ప్రణాళిక మీ దగ్గర ఉందా? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారికి లుక్ ఔట్ నోటీసులు ఇస్తున్నారని, మూసీ పేరుతో డబ్బులు దండుకునే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని చెప్పుకొచ్చారు. 


Similar News