BJP : మంత్రి సీతక్కను అడ్డగించిన బీజేపీ మహిళ మోర్చ.. ఆ మహిళకు న్యాయం చేయాలని డిమాండ్

ఆసిఫాబాద్‌లో ఆదివాసీ మహిళపై హత్యాచారానికి ఒడిగట్టిన రాక్షసుడు మఖ్దూమ్‌ను వెంటనే ఉరి తీయాలని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పా రెడ్డి డిమాండ్ చేశారు.

Update: 2024-09-05 12:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆసిఫాబాద్‌లో ఆదివాసీ మహిళపై హత్యాచారానికి ఒడిగట్టిన రాక్షసుడు మఖ్దూమ్‌ను వెంటనే ఉరి తీయాలని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పా రెడ్డి డిమాండ్ చేశారు. హత్యాచార ఘటనను నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈ రోజు గాంధీ హాస్పిటల్‌లో ఉన్న బాధిత మహిళను పరామర్శించడానికి వచ్చిన శిల్పారెడ్డి బాధిత కుటుంబంతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసనిచ్చారు. మహిళపై జరిగింది హత్యాచారమే అని కుటుంబ సభ్యులు మీడియా సాక్షిగా చెప్పినా మంత్రి సీతక్క ఈ కేసుని పక్కతోవ పట్టిస్తున్నారని నిరసిస్తూ మహిళకి న్యాయం జరగాలని గాంధీ హాస్పిటల్ ముందు బైఠాయించారు. అదే సమయంలో గాంధీలో ఉన్న మంత్రి సీతక్కను మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి అడ్డగించారు.

రోజుకో అత్యాచారం, గంటకో అఘాయిత్యం.. ఇదేనా మార్పు? అంటూ మంత్రిని నిలదీశారు. అనంతరం ఆమె బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడారు. బాధితురాలి వైపు నిలబడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దారుణ ఘటనను దారి మళ్ళించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గిరిజన ఆడబిడ్డలకు అండగా బీజేపీ మహిళా మోర్చా ఉందని, బాధితురాలికి న్యాయం జరిగే దాకా తమ పోరాటం ఆగదన్నారు. వెంటనే నిందితుడికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార, హత్యయత్నం కేసులు పెట్టి ఉరిశిక్ష విధించి బాధిత మహిళకి న్యాయం చేకూర్చాలని లేనియెడల రాష్ట్ర మహిళా మోర్చా తరపున ముందు ముందు చెప్పట్టపోయే కార్యక్రమాలు తీవ్రంగా ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


Similar News