Bandi Sanjay: బీఆర్ఎస్ విలీనంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

కేటీఆర్‌కు మీడియా ఫోబియా పట్టుకుందని అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

Update: 2024-09-22 07:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో/తెలంగాణ బ్యూరో :కేటీఆర్ కు మీడియా ఫోబియా పట్టుకుందని, ఆయనకు ఎప్పుడు న్యూస్ లో, సోషల్ మీడియాలో కనిపించాలనే తపన తప్ప మరేదానికి కేటీఆర్ పనికిరాడంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఆదివారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమృత్ పథకంలో అక్రమాలపై కేటీఆర్ చేసిన ఆరోపణలపై స్పందించారు. అక్రమాలపై ఆరోపణలు చేసే బదులు ఫిర్యాదు చేస్తే కేంద్రం విచారిస్తుంది కదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని, ఏనాటికైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయం అన్నారు. బీజేపీని ఎదుర్కోలేక ఆలోపు నిందలు వేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. హైడ్రాకు తాము వ్యతిరేకం కాదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని బడా నాయకుల ప్రోత్సాహంతోనే కబ్జాలు జరిగాయని ఆరోపించారు. అక్రమ కట్టడాలకు కారణమైన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా బీజేపీ మెంబర్ షిప్ డ్రైవ్‌కి అపూర్వ స్పందన వస్తోందని బండి సంజయ్ వెల్లడించారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే..

తిరుపతి లడ్డూలో కల్తీ హిందూ ధర్మంపై దాడి మాత్రమే కాదని, హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమేనని బండి పేర్కొన్నారు. పవిత్రమైన తిరుమల ప్రసాదం విషయంలో ఆరోపణలు రావడం సిగ్గుచేటన్నారు. ఈ వివాదంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని, తాజా ప్రభుత్వంలో తిరుపతి లడ్డు పట్ల ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్నారు. టీటీడీలో అన్యమతస్తులకు చోటు కల్పించకూడదని ఈ విషయంలో తాను గతంలోనే ఫిర్యాదు చేశానన్నారు. ఉగ్రవాదులను పెంచి పోషించేది ఎంఐఏం పార్టీ అని ఆరోపించారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.


Similar News