కేటీఆర్‌ నిలతీయాల్సింది కేసీఆర్‌ను.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)కు కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-10-15 11:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)కు కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రాడార్ వ్యవస్థకు ఎందుకు అనుమతి ఇచ్చారో ముందు మీ నాన్న కేసీఆర్‌ను నిలదీయ్ అని కేటీఆర్‌కు బండి సంజయ్ సూచించారు. ఆనాడు మీరే అనుమతి ఇచ్చి.. ఇప్పుడు మీరే వ్యతిరేకిస్తారా? అని సీరియస్ అయ్యారు. దేశ భద్రత వ్యవస్థ ఏర్పాటును వ్యతిరేకించడమంటే.. దేశ ప్రయోజనాలను వ్యతిరేకించినట్లే అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పినా మార్పు రాలేదని విమర్శించారు. వికారాబాద్ జిల్లా దామగుండం అడవుల్లో VLF స్టేషన్‌ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ‘ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు అంశం ఇప్పటిది కాదు.. గత పద్నాగేళ్లుగా పెండింగ్‌లో ఉంది. అన్ని అడ్డంకులు దాటుకుని ఈరోజు భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పదేపదే చొరవ తీసుకోవడంవల్లే ఇది సాధ్యమైంది’ అని బండి సంజయ్ అన్నారు.

‘దురద్రుష్టకరమేందంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాడార్ వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వికారాబాద్ మండలం పూడురు పరిధిలోని దామగూడెం రిజర్వు ఫారెస్ట్‌లో 1174 హెక్టార్ల భూమిని (దాదాపు2900 ఎకరాలు) ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు బదిలీ చేస్తూ 2017న డిసెంబర్ 19న జీవో నెం.44 జారీ చేసింది. అధికారంలో ఉన్నప్పుడు ఆమోదించిన బీఆర్ఎస్ నేతలే ఇవాళ వ్యతిరేకిస్తున్నారంటే ఏమనుకోవాలి. వాళ్ల ద్వంద్వ వైఖరికి నిదర్శనం.

ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఆమోదించిన వ్యవస్థను ఆయన కుమారుడి ఆధ్వర్యంలో పార్టీ నేతలు వ్యతిరేంచడం విడ్డూరం. కేసీఆర్ ఆనాడు సోయిలో ఉండే అనుమతి ఇచ్చారా? లేదా? తెలుసుకుంటే బాగుండేది. కేటీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ఫాంహౌజ్ ఎదుట ధర్నా చేయాలి. రాడార్ వ్యవస్థ ఏర్పాటుకు అనుమతిస్తూ భూముల బదలాయింపుకు ఎందుకు అంగీకారం తెలిపారో కేసీఆర్‌ను నిలదీస్తే బాగుండేది.

దేశ భద్రతకు సంబంధించి అంశాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు రాజీ లేకుండా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకించడమంటే దేశ భద్రతను వ్యతిరేకిస్తున్నట్లే. దేశ రక్షణ వ్యవస్థలను అవమానించిట్లే. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్న తీరును అసహ్యించుకుంటున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ది చెప్పినా వారిలో మార్పు రాకపోవడం సిగ్గు చేటు’ అని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.


Similar News