Bandi Sanjay: ఎంఐఎంకు కాంగ్రెస్ సర్కార్ భయపడుతోంది: బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్

ఎంఐఎం పార్టీకి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ భయపడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.

Update: 2024-09-18 07:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎంఐఎం పార్టీకి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ భయపడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఇవాళ కరీంనగర్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలకు తెలంగాణ చరిత్రను తెలియజేసేందుకు ఫొటో ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడుతాయని అన్నారు. చారిత్రక ఆనవాళ్లు గుర్తించేందుకు, చరిత్ర కనుమరుగు అవ్వకుండా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే నగరం నడిబొడ్డున భారత మాజీ హోంమంత్రి, తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 ముమ్మాటికీ తెలంగాణ విమోచన దినమేనని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఎంఐఎం పార్టీకి భయపడుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల స్థానంలో ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం పేరుతో ఎందుకు వేడుకలను నిర్వహించిందో సమాధానం చెప్పాలని బండి సంజయ్ అన్నారు.    


Similar News