కాంగ్రెస్ సర్కారు మరో భారీ కుట్ర.. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ సర్కారు మరో భారీ కుట్రకు తెరలేపిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.

Update: 2024-06-19 08:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సర్కారు మరో భారీ కుట్రకు తెరలేపిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజ్‌ను ఎవరు అధికారంలోకి వస్తే వారు మరమ్మత్తులు చేస్తారని అందరూ భావించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్ చేయక పోగా గత కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలు వేయడానికి ప్రయత్నించిందని ఫైర్ అయ్యారు. విలువైన సమయాన్ని ప్రభుత్వం వృధా చేసిందని దుయ్యబట్టారు.

ఇప్పుడు మరో కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపిందని.. మేడి గడ్డ బ్యారేజ్ నుంచి 92 లక్షల క్యూబిక్ మీటర్ల టన్నుల ఇసుకను తరలించేందుకు టెండర్లు పిలిచారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల జేబులు నింపడానికే ఈ చర్య అన్నారు. రేవంత్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పున సమీక్షించాలని కోరారు. ఈ టెండర్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధమన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే మేము కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. రైతులకు నీళ్లిచ్చే శ్రద్ధ లేదు కానీ ఇసుక దొబ్బి పోయే ప్రణాళికను కాంగ్రెస్ నేతలు అమలు చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ నేతలు ఇసుక సహా అన్ని దందాల్లో కూరుకుపోయారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖనిజాల వేలానికి డెడ్ లైన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు. సింగరేణి విషయం లోనూ అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ గనులు సింగరేణికి ఇవ్వాలని తాము డిమాండ్ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై సింగరేణి గనులను ప్రైవేటు పరం చేయాలని కుట్ర పన్నాయన్నారు. ఈ నెల 21న దేశ వ్యాప్తంగా 52 బొగ్గు బ్లాకులు వేలం వేస్తారని సమాచారం ఉందన్నారు. ఇందులో సింగరేణి బ్లాకులు కూడా ఉన్నాయని తమకు అనుమానం ఉందన్నారు. సింగరేణి బొగ్గు గనులు సింగరేణి కే ఉండాలని సీఎం రేవంత్ కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు.

ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీకి సున్నపు రాయి గనులు, బయ్యారం స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం కేటాయించేలా కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలన్నారు. నీట్ పరీక్షను రద్దు చేసి తక్షణమే నిర్వహించాలన్నారు. నిన్న తమ విద్యార్ధి విభాగం రాజ్ భవన్‌ను ముట్టడించిందన్నారు. గొర్రెల కొనుగోలులో ఏవో అవకతవకలు జరిగాయని ఈడీ జోక్యం చేసుకుందని.. నీట్ ప్రశ్న పత్రాలను లక్షలు పెట్టి కొన్నారు ..అందులో ఈడీ జోక్యం చేసుకోదా? అన్నారు. నీట్‌పై సీఎం రేవంత్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్‌పై కూడా కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కయ్యాయన్నారు. రేవంత్ రెడ్డికి కమీషన్ల మీదున్న శ్రద్ధ ప్రజల సమస్యల మీద లేదన్నారు. తెలంగాణ లో అన్ని వర్గాలు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు అన్నదమ్ముల్లా తెలంగాణ గనులు ప్రైవేటు వారికి ధారదత్తం చేయాలని పథకం వేసినట్టు ఉన్నారన్నారు. 


Similar News