ఆంధ్రజ్యోతికి ఎడిటర్ కే. శ్రీనివాస్ రాజీనామా

ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిలో తాజాగా కీలక పరిణామాలు జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎడిటర్‌గా కొనసాగుతున్న కే.శ్రీనివాస్ తన రిటైర్మెంట్

Update: 2024-10-19 07:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిలో తాజాగా కీలక పరిణామాలు జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎడిటర్‌గా కొనసాగుతున్న కే.శ్రీనివాస్ తన రిటైర్మెంట్ ప్రకటించి రాజీనామా చేయగా, ఆయన స్థానంలో సీనియర్ జర్నలిస్ట్ రాహుల్‌ కుమార్‌ను సంపాదకుడిగా నియమిస్తూ సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్టు, నవంబర్ 1 నుంచి ఈ మార్పు అమలు కానున్నట్టు సమాచారం. 1996లో పాత ఆంధ్రజ్యోతిలో చేరిన శ్రీనివాస్, 2002 అక్టోబర్‌ పున:ప్రారంభ సమయంలో అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. 2008 జనవరి నుంచి సుదీర్ఘకాలం ఎడిటర్‌గా కొనసాగుతున్నారు.

ప్రజాదరణ పొందిన కాలమిస్ట్..

నల్లగొండ జిల్లాలో జన్మించిన శ్రీనివాస్ ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఓరియంటల్‌ కాలేజీలో బీఏ చదివారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ చేశారు. జర్నలిజంలోనూ మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1983-84లో ‘ఊరు వాడ’ వారపత్రికతో ఆయన జర్నలిజం కెరీర్ మొదలైంది. తర్వాత ఉదయంలో, ఆంధ్రజ్యోతి మూతబడిన కాలంలో పలు చిన్న పత్రికల్లో పనిచేశారు. ఆంధ్రజ్యోతిలో ఆయన రాసిన ‘సందర్భం’ కాలమ్, ప్రజాతంత్రలో రాసిన ‘కొత్తవంతెన’ కాలమ్ అత్యంత ప్రజాదరణ పొంది తర్వాత పుస్తకాలుగా వచ్చాయి. తెలుగు భాష, అస్తిత్వ ఉద్యమాలు, రాజకీయాలు, స్థానికతా భావనల పైన ఆయన రాసిన విమర్శనాత్మక వ్యాసాలు పాఠకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. తాజా పరిణామాలతో ఆంధ్రజ్యోతి పత్రికకు ఖచ్చితంగా తీరని లోటేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

డిజిటల్ మీడియాలో ప్రవేశానికి ప్రయత్నాలు..

భవిష్యత్ కార్యాచరణ విషయమై ‘దిశ’.. ఎడిటర్ కే శ్రీనివాస్‌ను సంప్రదించగా, అల్లం నారాయణ తదితర మిత్రులతో కలిసి ఒక డిజిటల్ ప్లాట్‌ఫాంను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని, పెట్టబడి సమీకరణ జరుగుతోందని తెలిపారు.

Tags:    

Similar News