రాష్ట్రంలో అమానవీయ ఘటన.. మహిళను వివస్త్రను చేసి మరి..

సభ్య సమాజం తలదించుకునే విధంగా ముగ్గురు దుర్మార్గులు గత పది రోజులుగా ఓ ఇంట్లో చెంచు మహిళను నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టి వాతలు పెట్టిన సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగు చూసింది.

Update: 2024-06-20 02:41 GMT

దిశ, కొల్లాపూర్ : రాష్ట్రంలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా ముగ్గురు దుర్మార్గులు గత పది రోజులుగా ఓ ఇంట్లో చెంచు మహిళను నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టి వాతలు పెట్టారు. ఈ ఘటన బుధవారం వెలుగు చూసింది. ఈ పాశవిక చర్య నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతపల్లిలో చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొల చింతపల్లి లోని చెంచు భ్రమరాంబ కాలనీకి చెందిన కాట్రాసు ఈదన్న ఈశ్వరమ్మలు భార్యాభర్తలు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు.పది రోజుల క్రితం భార్యాభర్తలు గొడవ పడడంతో ఈశ్వరమ్మ ఊరు విడిచి వెళ్ళింది. దీంతో తన భార్య కనిపించడం లేదంటూ గ్రామంలో తనకు తెలిసిన వారితో భర్త వాకప్ చేశాడు. అయితే తమ పొలాన్ని కౌలుకు చేస్తున్న అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్ బండి శివుడు సలేశ్వరంకు ఈశ్వరమ్మ తల దాచుకున్న సమాచారం తెలుసుకున్నారు.

సదరు దుర్మార్గులు రహస్యంగా బైకుపై మొలచింతపల్లి గ్రామానికి తీసుకొస్తూ మార్గమధ్యంలో చితకబాది ఓ ఇంట్లో నిర్బంధించారు. అయితే దుర్మార్గులు ఇంతటీ ఆగకుండా ఆదివాసి మహిళ ఈశ్వరమ్మను వివస్త్ర చేసి చిత్రహింసలకు గురిచేసి, ఆ తరువాత శరీరంపై వాతలు పెట్టి పచ్చికారం నూరి శరీరంపైన, కళ్ళలోనూ, మర్మాంగంలోనూ చల్లారు. ఆ మంటలకు తాళలేక బాధితురాలు రోదించినప్పటికీ చుట్టుపక్కల ఇళ్ల వారు స్పందించకపోవడం విచారకరం. అయితే ఇంత జరిగినప్పటికీ గాను తన భార్య ఈశ్వరమ్మ ఆచూకీ మాత్రం భర్త ఈదన్నకు తెలియ రాలేదు. తన భార్య గత పది రోజుల నుంచి కనబడడం లేదని భర్త ఈదన్న గ్రామస్తులకు తెలపడంతో ఈ పాశవీక చర్య ఆనోటా ఆనోటా బుధవారం బయటపడింది. నమ్మకస్తులే ఈ కిరాతకానికి పాల్పడడం శోచనీయం.

కౌలు రైతులే నిందితులు! 

కాట్రాసు ఈదన్నకు ఉన్న వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్ ,బండి శివుడులు కౌలు తీసుకొన్నారు. అయితే సదరు కౌలుదారులు ఆ చెంచు దంపతులను తమ పొలం వద్దనే జీతం పెట్టుకున్నారని గ్రామస్తులు తెలిపారు. భార్యాభర్తల గొడవ కారణంగా భార్య ఈశ్వరమ్మ ఇల్లు విడిచి వెళ్లడంతో సదరు దుర్మార్గులు ఇందులో తలదూర్చి కిరాతకానికి పాల్పడ్డారు.

గ్రామస్తుల సమాచారంతో రంగంలోకి పోలీసులు!

నల్లమల అటవీ తీర ప్రాంతంలోని మొలచింతపల్లి చెంచు భ్రమరాంబ కాలనీకి చెందిన కాట్రాసు ఈశ్వరమ్మ, అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్ ,బండి శివుడు సలేశ్వరంల చేసిన దారుణ సంఘటనను గ్రామస్తులు పోలీసులకు బుధవారం సాయంత్రం సమాచారం అందించారు. దీంతో కొల్లాపూర్ పోలీసులు గ్రామానికి చేరుకొని నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలు ఈశ్వరమ్మను చికిత్స నిమిత్తం 108 వాహనంలో కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడి నుంచి నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించినట్లు పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు కొల్లాపూర్ ఎస్సై హృషికేష్ తెలిపారు. ఇది ఇలా ఉండగా మొలగింతపల్లిలో దుర్మార్గుల చేత అఘాయిత్యానికి గురైన చెంచు కాట్రాసు ఈశ్వరమ్మకు న్యాయం చేయాలని కోరుతూ ఆదివాసి చెంచుల సంఘం జిల్లా రాష్ట్ర నాయకులు గురువారం ములచింతపల్లి గ్రామానికి రానున్నట్లు సమాచారం.

Also Read: హైదరాబాద్‌లో రౌడీ షీటర్ దారుణ హత్య


Similar News