వచ్చే ఐదేళ్లలో కోటి మందికి ఏఐ సేవలు : CM Revanth Reddy

రానున్న కాలంలో ఏఐ సేవలు మరింత విస్తృతం చేస్తామని, అందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-05 11:56 GMT

దిశ, శేరిలింగంపల్లి : రానున్న కాలంలో ఏఐ సేవలు మరింత విస్తృతం చేస్తామని, అందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని హెచ్‌ఐసీసీలో రెండు రోజుల ఏఐ ( ఆర్టీఫీషియల్ ఇంటలీజెన్స్) గ్లోబల్ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఏఐ రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించారు. రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యలను ఇందులో పేర్కొన్నారు.ఈ సదస్సుకు వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

కృత్రిమ మేధా పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు, పరిశోధనలను ప్రోత్సహించటానికి, ఏఐ పర్యావరణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ భాగస్వాములతో కలసి పనిచేసేందుకు సిధ్ధంగా ఉన్నట్లు చెప్పారు. తెలంగాణాలో ఏఐ డెవలప్మెంట్ కు 25 అంశాలతో రోడ్ మ్యాప్ ను విడుదల చేశారు. తెలంగాణ ప్రగతిలో ఏఐ కూడా భాగస్వామ్యం అవుతుందని ఈ మేరకు అనేక అంశాలపై తన విజన్ ను తెలియజేశారు. వచ్చే 5 ఏళ్లలో కోటి మందికి ఏఐ సేవలు అందించనున్నట్లు తెలియజేశారు. విద్యా, వ్యవసాయం, ఆరోగ్యం, పరిశ్రమల వంటి రంగాలలో ఉత్పాదకతను మెరుగు పరిచే ఏఐ గురించిన పరిజ్ఙానాలు, వివిధ రంగాలపై ఏఐ ప్రభావం వంటి పలు అంశాలను ఈ సదస్సులో లోతుగా చర్చిస్తామన్నారు.

ఆర్ధిక శక్తిగా ఎదగటానికి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్: మంత్రి శ్రీధర్ బాబు

అంతకు ముందు రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కృత్రిమ మేధ ఉపయోగానికి, ఏఐ అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రజాస్వామ్య పద్దతులకు కట్టుబడి ఉంటూనే, ఏఐ వినియోగంపై ఖచ్చితమైన నియంత్రణలు అమలు చేయాలని భావిస్తున్నట్లు, సంబంధిత సంస్థలతో కలసి పనిచేస్తున్నట్లు చెప్పారు. నిరంతర ఆర్థిక అభివృద్థి కోసం ఏఐను వినియోగిస్తున్నన్నారు. రానున్న సంవత్సరాలలో రాష్ట్రం ఒక ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ కు సమీపంలో 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నామన్న ఆయన ప్రపంచ స్థాయి ఏఐ కంపెనీలు ఇక్కడ ఏర్పాటు అయ్యేలా చూస్తామని వివరించారు.

పలు ఏఐ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు

రాష్ట్రాన్ని ఏఐ బేస్డ్ పవర్ గా తీర్చిదిద్దనున్నామని, హైదరాబాద్ లో ఏఐ సిటీ ఉత్తమ పరిశోధనా, సృజనాత్మక ప్రోత్సాహకంగా పని చేస్తుందనీ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఏఐ సిటీలో ఏఐ స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్స్ ను ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రతి డిపార్ట్ మెంటులో ఒక ఏఐ ఏజెంటును నియమిస్తామని, పాఠశాల విద్యలో ఏఐను ప్రవేశపెట్టటం కూడా రోడ్ మ్యాప్ లో భాగమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు ఏఐ సంస్ధలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది.


Similar News