ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ అన్నారు.

దిశ, మంచిర్యాల : ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని చెన్నూర్ మండలంలోని బతుకమ్మ వాగు సమీపంలోని తాగునీటి ట్యాంక్ తో పాటు బట్టిగూడ గ్రామంలోని తాగునీటి ట్యాంక్ ను, చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. నిరంతరాయంగా శుద్ధమైన తాగునీటిని అందించాలని కోరారు.
మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పైప్ లైన్ ల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన అమృత్ 2.0 పథకంలో నిర్మాణం అవుతున్న తాగునీటి ట్యాంక్ ల నిర్మాణ పనులను వేగవంతం చేసి ఈ వేసవిలో ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.