ఆక్రమణలను కూలగొట్టాల్సిందే.. హైడ్రాకు మద్దతు పలికిన పోసాని
ఆక్రమణలను కూలగొట్టాల్సిందేనని హైడ్రాకు పోసాని మద్దతు పలికారు..
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్లో హైడ్రా(HYDRA) చర్యలు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. చెరువులు, వాగులు, వంకలు, కాలువలు, నదుల వెంట నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా అక్రమంగా నిర్మించిన చిన్న రేకుల షెడ్డు నుంచి పెద్ద పెద్ద భవంతులను సైతం నేలమట్టం చేస్తున్నారు. సినీ నటుడు నాగార్జున ఎన్కన్వెన్షన్(Film Actor Nagarjuna Enconvention)పైనా హైడ్రా చర్యలు తీసుకుంది. దీంతో హైడ్రా పేరు వింటేనే అక్రమార్కులు హడలిపోతున్నారు. కూల్చివేతలను కొందరు సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైడ్రా తీరుపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Film actor Posani Krishnamurali) సైతం స్పందించారు. తాను హైదరాబాద్(Hyderabad)లో పలు స్థలాలు చటబద్ధంగా కొన్నానని చెప్పారు. 40 ఏళ్ళుగా ఎలాంటి సమస్య లేదని తెలిపారు. నాగార్జున ఎన్ కన్వెషన్ సెంటర్ చెరువు పరిధిలో ఉందని, దానిని కూల్చడం కరెక్టేనని స్పష్టం చేశారు. అక్రమంగా నిర్మించిన దానికి చట్టబద్ధత కల్పించాలని తాను వెళ్ళి సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy)ని అడిగితే "నీకు బుద్ధి లేదా?" అని అంటాడని చెప్పారు. ఎవరైనా పైరవీలకు అలవాటు పడితేనే ఇలాంటి సమస్యలు వస్తాయని నటుడు పోసాని పేర్కొన్నారు.