రాష్ట్రంలో మరో 17 డిగ్రీ కాలేజీలు.. సర్కార్​ జీవో రిలీజ్​

రాష్ట్రంలో కొత్తగా మరో 17 డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

Update: 2023-06-23 16:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా మరో 17 డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బీసీ వెల్ఫేర్​లో విభాగంలో గద్వాల, నారాయణపేట్, నాగర్​కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్, యాదాద్రి భూవనగిరి లలో కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం సర్కార్​జీవో రిలీజ్​చేసింది. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమాలకర్​మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల సమగ్ర అభివ్రుద్ది కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందన్నారు. గతంలో కేవలం 19 బీసీ గురుకులాలు అరకొర వసతులతో ఉండేవని,సీఎం సంకల్పంతో అవి ఇప్పుడు 327కుపెరిగాయన్నారు. దీంతో రాష్ట్రంలో దాదాపు 2లక్షల మంది వెనుకబడిన బిడ్డలు ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యనభ్యసిస్తున్నారని ఆనందం వ్యక్తం చేసారు.

గత ఏడాది 15 డిగ్రీ కాలేజీలు..

గత సంవత్సరమే 15 డిగ్రీ కాలేజీలను మంజూరు చేసుకొని క్లాసులు ప్రారంభించుకున్నామని, వాటి ద్వారా 15,360 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు.ఈ సంవత్సరం ప్రారంభించే డిగ్రీ కాలేజీల్లో మరో 16,320 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. కేవలం డిగ్రీ గురుకులాల్లోనే 31,680 మందికి ప్రపంచస్థాయి విద్యను అందిస్తామన్నారు. ఈ నూతన డిగ్రీకాలేజీలతో రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ ఏర్పాటవుతుందన్నారు.

ప్రతి నెల 15 న సాయం..

వెనుకబడిన వర్గాల లక్ష సహాయం కోసం క్షేత్ర స్థాయిలో దరఖాస్తుల పరిశీలన ప్రారంభమైందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 5,28,862 అప్లికేషన్లు వచ్చాయని,వర్గాల వారిగా బీసీఏ 2,66,001, బీసీబీ 1,85,136, బీసీడీ 65,310, ఎంబీసీలు12,415 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. దరఖాస్తుల క్రమసంఖ్య ప్రకారం.. పరిశీలన కొనసాగుతుందన్నారు, ప్రతతి నెల 5వ తారీఖు వరకు వెరిఫికేషన్ పూర్తైన వారికి , అదే నెల 15వ తారీఖున స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా సాయం అందిస్తామన్నారు.


Similar News