ట్రినిడాడ్ : ఇంగ్లాండ్పై వన్డే సిరీస్ను దక్కించుకున్న ఆతిథ్య వెస్టిండీస్.. టీ20 సిరీస్నూ కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు చెరో రెండు విజయాలు నమోదు చేయడంతో సిరీస్ ఫలితం నిర్ణయాత్మక ఐదు టీ20లో తేలింది. శుక్రవారం జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను విండీస్ ఓడించింది. డిసైడర్ మ్యాచ్లో ఇంగ్లాండ్కు షాకించిన వెస్టిండీస్ 3-2తో సిరీస్ను దక్కించుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 19.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది.
గత మ్యాచ్ సెంచరీ వీరుడు, ఓపెనర్ సాల్ట్(38) టాప్ స్కోరర్. లివింగ్స్టోన్(28), మొయిన్ అలీ(23) చెప్పుకోదగ్గ పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో మోటీ 3 వికెట్లు తీయగా.. హుస్సేన్, రస్సెల్, హోల్డర్ రెండేసి వికెట్లతో సత్తాచాటారు. అనంతరం 133 పరుగుల లక్ష్యాన్ని విండీస్ జట్టు 19.2 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి ఛేదించింది. షాయ్ హోప్(43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రూథర్ఫోర్డ్(30), జాన్సన్ చార్లెస్(27) విలువైన పరుగుల జోడించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో రీస్ టోప్లే, ఆదిల్ రషీద్ తలా రెండు వికెట్లతో రాణించారు.