ఆరు రోజులపాటు జరగనున్న శ్రీలంక, న్యూజిలాండ్ టెస్టు.. కారణం ఏంటో తెలుసా?

టెస్టు మ్యాచ్ సాధారణంగా ఐదు రోజులపాటు జరుగుతుంది.

Update: 2024-08-23 12:38 GMT

దిశ, స్పోర్ట్స్ : టెస్టు మ్యాచ్ సాధారణంగా ఐదు రోజులపాటు జరుగుతుంది. అంతకంటే ముందే పూర్తవ్వొచ్చు. కానీ, ఆరు రోజులపాటు జరగడం చాలా అరుదు. శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే టెస్టు మ్యాచ్‌ను ఆరు రోజులపాటు నిర్వహించనున్నారు. కివీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు సెప్టెంబర్‌లో శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు గల్లెలోని గల్లె ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక. ఈ సిరీస్‌లో తొలి టెస్టు ఆరు రోజులపాటు జరగనుంది. సెప్టెంబర్ 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 21న శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ టెస్టును ఆరు రోజులపాటు నిర్వహించనున్నారు.

ఎన్నికల రోజు రెస్ట్ డేగా ఉండగా.. మిగతా రోజుల్లో మ్యాచ్ జరగనుంది. సుదీర్ఘ ఫార్మాట్‌ చరిత్రలో ఆరు రోజుల మ్యాచ్ కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. గత శతాబ్దంలో ముఖ్యంగా ఇంగ్లాండ్‌లో చాలా మ్యాచ్‌లు జరిగేవి. ఆదివారాన్ని ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవడానికి కేటాయించేవారు. అయితే, ఆధునిక క్రికెట్‌లో ఆ మ్యాచ్‌లు చాలా అరుదు. శ్రీలంక చివరిసారిగా రెండు దశాబ్దాల క్రితం అలాంటి టెస్టును నిర్వహించింది. 2001లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌ ఆరు రోజులపాటు జరగగా.. ఆ దేశంలో ముఖ్యమైన పౌర్ణమి రోజైన పోయా రోజును విశ్రాంతి రోజుగా పరిగణించారు. 2008లో ఢాకా వేదికగా బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్టు కూడా రెస్ట్ డేతో కలిపి ఆరు రోజులపాటు జరిగింది. శ్రీలంక, కివీస్ జట్ల మధ్య రెండో టెస్టు సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. 

Tags:    

Similar News