రెజ్లింగ్ చాంపియన్స్ సూపర్ లీగ్‌‌ను ప్రారంభించబోతున్నాం : ప్రకటించిన స్టార్ రెజ్లర్లు

భారత స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, అమన్ సెహ్రావత్, గీతా ఫొగట్ సోమవారం కీలక ప్రకటన చేశారు.

Update: 2024-09-16 13:58 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, అమన్ సెహ్రావత్, గీతా ఫొగట్ సోమవారం కీలక ప్రకటన చేశారు. తాము త్వరలోనే రెజ్లింగ్ చాంపియన్స్ సూపర్ లీగ్(డబ్ల్యూసీఎస్ఎల్)ను ప్రారంభించబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. భారత రెజ్లర్లలో నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు ప్రపంచ వేదికపై అత్యుత్తమ రెజ్లర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ లీగ్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ‘సాక్షి, నేను చాలా రోజులుగా ఈ లీగ్‌ గురించి ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే తుది రూపు దాల్చనుంది. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. ఆటగాళ్లే నిర్వహించే తొలి లీగ్ ఇదే కానుంది. మేము ఇంకా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ)తో మాట్లాడలేదు. డబ్ల్యూఎఫ్‌ఐ, ప్రభుత్వం మద్దతు ఇస్తాయని భావిస్తు్న్నాం. ఇది ఆటగాళ్లు, వారి ప్రయోజనాల కోసం చేస్తున్నాం. కాబట్టి, ఎవరికీ సమస్య ఉండదనుకుంటున్నా. డబ్ల్యూఎఫ్ఐ, ప్రభుత్వం భాగస్వామ్యమైతే ఇంకా మంచిది.’ అని గీతా ఫొగట్ తెలిపింది. ఈ లీగ్‌కు డబ్ల్యూఎఫ్‌ఐ ఆమోదం పొందాల్సి ఉంది. అయితే, రెజ్లర్లు ప్రకటించిన డబ్ల్యూసీఎస్ఎల్ లీగ్ ఆమోదానికి డబ్ల్యూఎఫ్‌ఐ ప్రెసిడెంట్ సంజయ్ సింగ్ నిరాకరించారు. సొంత ప్రొ రెజ్లింగ్ లీగ్‌ను పునరుద్ధరించే ఆలోచన ఉందన్నారు. రెజ్లర్లు తమ సొంత లీగ్‌ను ప్రారంభించుకోవచ్చని, అందులో డబ్ల్యూఎఫ్‌ఐ పాత్ర ఉండదని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News