ఒలింపిక్స్‌లో బోపన్నకు జోడీగా బాలాజీ

పారిస్ ఒలింపిక్స్‌లో టెన్నిస్ పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో భారత స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న సహచర ప్లేయర్ శ్రీరామ్ బాలాజీతో కలిసి బరిలో నిలువనున్నాడు.

Update: 2024-06-04 12:46 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో టెన్నిస్ పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో భారత స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న సహచర ప్లేయర్ శ్రీరామ్ బాలాజీతో కలిసి బరిలో నిలువనున్నాడు. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉన్న క్రీడాకారులు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. వారు తమ దేశానికి చెందిన భాగస్వామిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. వరల్డ్ నం.4 ర్యాంకర్ అయిన బోపన్న ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఖాయమే. ఈ నెలలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. 

తాజాగా బోపన్న ఒలింపిక్స్‌లో తన భాగస్వామిగా వరల్డ్ నం.84 ర్యాంకర్ బాలాజీని ఎంచుకున్నాడు. ఈ విషయాన్ని బోపన్న ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్(ఏఐటీఏ)కు తెలియజేశాడు. అతని నిర్ణయానికి ఏఐటీఏ కూడా మద్దతు తెలిపింది. బాలాజీతో కలిసి ఆడాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏఐటీఏ సెక్రెటరీ జనరల్ అనిల్ ధూపర్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో బాలాజీ ఆకట్టుకోవడంతో బోపన్న అతని వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. మరో భారత ప్లేయర్ యుకీ బాంబ్రీ కూడా పోటీలో ఉన్నాడు.

కాగా, ఈ ఏడాది బోపన్న ఆస్ట్రేలియా పార్ట్‌నర్ ఎబ్డెన్‌తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. రియో ఒలింపిక్స్‌-2016లో బోపన్న-సానియా మీర్జా జోడీ మిక్స్‌డ్ డబుల్స్‌లో తృటిలో కాంస్య పతకం చేజార్చుకున్న విషయం తెలిసిందే. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ఈ జంట ఓటమిపాలై పతకాన్ని కోల్పోయింది. 


Similar News