PKL : కబడ్డీ.. కబడ్డీ.. వచ్చే నెల 18 నుంచి ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభం

Update: 2024-09-09 13:07 GMT

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్ వచ్చే నెల 18 నుంచి ప్రారంభంకానుంది. లీగ్ నిర్వాహకులు సోమవారం షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. హైదరాబాద్ వేదికగా తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో టోర్నీ మొదలుకానుంది. లీగ్ స్టేజ్ షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించగా.. ప్లే ఆఫ్స్, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌ తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. ఈ సారి లీగ్ మూడు వేదికల్లోనే జరగనుంది. గత సీజన్‌లో 12 వేదికల్లో మ్యాచ్‌లు జరిగాయి.

11వ సీజన్‌కు హైదరాబాద్, నోయిడా, పుణె మాత్రమే ఆతిథ్యమిస్తున్నాయి. మొదట హైదరాబాద్‌లోనే మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 9 వరకు హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకు నోయిడాలో, డిసెంబర్ 3 నుంచి 24 వరకు పుణెలో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. లీగ్ దశలో ప్రతి జట్టు ఇతర 11 జట్లతో రెండేసి మ్యాచ్‌ల చొప్పున మొత్తం 22 మ్యాచ్‌లు ఆడనుంది. టాప్-2 జట్లు నేరుగా సెమీస్‌కు చేరుకుంటాయి. ఆ తర్వాతి నాలుగు జట్లు రెండు సెమీస్ బెర్త్‌ల కోసం ఎలిమినేటర్‌లో తలపడతాయి. 

Tags:    

Similar News