IPL 2024లో ఆడనున్న పాకిస్తాన్ బౌలర్..!
మహ్మద్ అమీర్ పాకిస్తాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్టార్ బౌలర్లలో ఒక్కడు.
దిశ, వెబ్డెస్క్: మహ్మద్ అమీర్ పాకిస్తాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్టార్ బౌలర్లలో ఒక్కడు. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా 2020 డిసెంబర్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి అనూహ్యంగా అమీర్ తప్పుకున్నాడు. పీసీబీ చైర్మెన్ రమీజ్ రజా పదవి నుంచి తప్పకోవడంతో అమీర్ మళ్లీ పాకిస్తాన్ తరఫున క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు కొన్ని నెలల కిందట వార్తలు వినిపించాయి. కానీ అమీర్ పాకిస్తాన్కు కాకుండా ఐపీఎల్లో ఆడేందుకు అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2008 ఐపీఎల్ సీజన్ తర్వాత ఏ ఒక్క పాక్ ఆటగాడు కూడా ఆడటంలేదు.
అమీర్ 2016లో బ్రిటిష్ యువతి, లాయర్ నర్జీస్ ఖాన్ని వివాహం చేసుకున్నాడు. అమీర్ ప్రస్తుతం ఆమెతో కలిసి ఇంగ్లండ్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో 2024లో బ్రిటీష్ పాస్పోర్ట్తో పాటు, యూకే పౌరసత్వం పొందనున్నట్లు సమాచారం. ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ తన ఐపీఎల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్ గురించి ఇంకా ఆలోచించలేదు. నేను బ్రిటన్ నుంచి నా పాస్పోర్ట్ పొందడానికి ఇంకా ఒక సంవత్సరం సమయం ఉంది. ఇప్పటికైతే ఒక్కో అడుగు వేయాలని అనుకుంటున్నా అని అమీర్ పేర్కొన్నాడు.