Jayasuriya : శ్రీలంక హెడ్ కోచ్‌గా జయసూర్య

శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య శ్రీలంక జాతీయ పురుషుల జట్టుకు ఫుల్ టైం హెడ్ కోచ్‌గా నియామకమయ్యాడు.

Update: 2024-10-07 12:23 GMT

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య శ్రీలంక జాతీయ పురుషుల జట్టుకు హెడ్ కోచ్‌గా నియామకమయ్యాడు. శ్రీలంక క్రికెట్(ఎస్‌ఎల్‌సీ) ఎగ్జిక్యూటివ్ కమిటీ సోమవారం అతని నియామకాన్ని ధ్రువీకరించింది. మార్చి 31, 2026 వరకు జయసూర్య హెడ్ కోచ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

మొదట ఎస్‌ఎల్‌సీ క్రికెట్ సలహాదారుడిగా ఉన్న జయసూర్య.. ఇటీవల టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టుకు తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా నియామకమయ్యాడు. జయసూర్య మార్గదర్శకత్వంలో శ్రీలంక జట్టు ఇటీవల మంచి ప్రదర్శన చేసింది. భారత్‌ చేతిలో టీ20 సిరీస్ కోల్పోయినప్పటికీ.. వన్డేల్లో మాత్రం సత్తాచాటింది. 1997 తర్వాత తొలిసారిగా భారత్‌పై ద్వైపాక్షిక సిరీస్‌ను దక్కించుకుంది.

గత నెల ఆరంభంలో ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో నెగ్గింది. అంతేకాకుండా, న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను శ్రీలంక క్లీన్‌స్వీప్ చేయడం గమనార్హం. జయసూర్య కోచింగ్‌లో జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో అతన్ని హెడ్ కోచ్‌గా కొనసాగించాలని ఎస్‌ఎల్‌సీ నిర్ణయించింది. ఈ నెలలో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌తో ఫుల్ టైం హెడ్ కోచ్‌గా జయసూర్య బాధ్యతలు చేపట్టనున్నాడు.  

Tags:    

Similar News