తవ్వకాలను నిలిపేయండి..హైకోర్టు స్టేటస్​కో ఉత్తర్వులు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలో గ్రానైట్​తవ్వకాలను నిలిపేయాలని హైకోర్టు ఆదేశించింది. మంగళవారం స్టేటస్​కో ఉత్తర్వులను జారీ చేసింది. మంత్రి రజనితోపాటు ఎంపీ అవినాష్​రెడ్డి

Update: 2023-03-29 03:05 GMT

దిశ, ఏపీ బ్యూరో: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలో గ్రానైట్​తవ్వకాలను నిలిపేయాలని హైకోర్టు ఆదేశించింది. మంగళవారం స్టేటస్​కో ఉత్తర్వులను జారీ చేసింది. మంత్రి రజనితోపాటు ఎంపీ అవినాష్​రెడ్డి బంధువులు ప్రతాపరెడ్డి, శ్వేతారెడ్డి, జీవీ దినేష్​రెడ్డి, శివ పార్వతికి నోటీసులు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన డీకే పట్టాలను రద్దు చేయకుండా సదరు భూముల్లో క్వారీయింగ్​చేసేందుకు ఎన్‌వోసీ ఇవ్వడంపై రైతులు హైకోర్టును ఆశ్రయించారు. 21.5 ఎకరాల్లో గ్రానైట్​తవ్వకాలు చేపట్టినట్లు రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ భూముల్లో సుమారు రూ.200 కోట్ల విలువైన గ్రానైట్​నిక్షేపాలున్నట్లు న్యాయస్థానం ముందుంచారు. పిటిషన్‌దారుల అడ్వకేట్​వాదనలు విన్న హైకోర్టు అనుమతులు ఇచ్చిన తహసీల్దారుతోపాటు రైతులను పనులకు వెళ్లకుండా అడ్డుకున్న ఎస్సైకి కూడా నోటీసులు జారీ చేసింది. యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశిస్తూ ఈ కేసును ఏప్రిల్​10కి వాయిదా వేసింది. మంత్రితోపాటు మిగతావాళ్లు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే..

సుమారు పదిహేనేళ్ల క్రితం మురికిపూడిలో పేదలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం అసైన్డ్​భూమి ఇచ్చింది. 90 ఎకరాల్లో పేద ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబాలకు బీ ఫారాలు ఇచ్చారు. అప్పటినుంచి రైతులు సదరు భూములను సాగు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ గ్రానైట్​నిక్షేపాలున్నట్లు గుర్తించింది. నాడు కొందరు టీడీపీ నేతలు ఈ భూముల్లో క్వారీయింగ్​చేయాలని ప్రయత్నించారు. ఎస్సీఎస్టీలకు ఇచ్చిన భూములు కావడంతో వాటిని గనుల శాఖ తీసుకోవాలంటే పట్టాదారులకు ప్రత్యామ్నాయ భూమిని చూపించాలి. దీనికితోడు నాడు రైతులు క్వారీయింగ్‌కు ఇచ్చేది లేదని అడ్డం తిరిగారు.

ప్రభుత్వం మారిన తర్వాత ఈ భూములపై అధికార వైసీపీ నేతల దృష్టి పడింది. అనుకున్నదే తడవుగా తహసీల్దారు ఎన్‌వోసీలు మంజూరు చేశారు. గ్రానైట్​క్వారీయింగ్‌కు యంత్రాలను దించారు. రైతులు వాళ్లను అడ్డుకున్నారు. రైతులపైకి పోలీసులను ఉసిగొల్పి భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది డిసెంబరు 27న రైతుల తరపున అడ్వకేట్​వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. కడప ఎంపీ అవినాష్​రెడ్డి మామ వీరప్రతాపరెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ భార్యకు చెందిన కంపెనీకి గ్రానైట్​క్వారీయింగ్​లీజు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు కోర్టుకు తెలిపారు. రైతులను తమ భూముల్లోకి వెళ్లకుండా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. ఎస్సై స్టేషన్‌కు పిలిపించి బీ ఫారాలు సరెండర్​చేయకుంటే కేసులు పెడతామని బెదిరించినట్లు న్యాయస్థానానికి నివేదించారు. మంత్రి రజనిని కలవాలని ఎస్సై చెప్పినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు.

తర్వాత కొందరు పిటిషనర్లు మంత్రి విడదల రజనిని కలిశారు. బీ ఫారాలను సరెండర్​చేయకుంటే రద్దు చేయిస్తానని మంత్రి హెచ్చరించినట్లు న్యాయస్థానానికి వెల్లడించారు. మంత్రి అనుచరులు బెదిరించినట్లు కోర్టుకు వివరించారు. ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు లీజు కోసం దరఖాస్తు చేయడంతో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఎన్‌వోసీలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మైనింగ్​లీజును రద్దు చేయాలని హైకోర్టును కోరారు. రైతులను భూముల నుంచి ఖాళీ చేయించకుండా రెవెన్యూ అధికారులను అడ్డుకోవాలని అత్యున్నత న్యాయ స్థానానికి నివేదించారు. పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత యథాస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News