టీ కాంగ్రెస్‌లోకి ఏపీ నేత ఎంట్రీ.. రేవంత్‌కు ఫుల్ సపోర్ట్

రాష్ట్ర కాంగ్రెస్​సీనియర్లకు దిగ్విజయ్​రూపంలో షాక్​తగిలింది. సంక్షోభాన్ని నివారించేందుకు రాష్ట్రానికి వచ్చిన ఆయన సీనియర్లకు వార్నింగ్​ఇస్తూనే.. రేవంత్​ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్లు వ్యవహరించారు.

Update: 2022-12-23 23:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కాంగ్రెస్​సీనియర్లకు దిగ్విజయ్​రూపంలో షాక్​తగిలింది. సంక్షోభాన్ని నివారించేందుకు రాష్ట్రానికి వచ్చిన ఆయన సీనియర్లకు వార్నింగ్​ఇస్తూనే.. రేవంత్​ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్లు వ్యవహరించారు. దాదాపు ఒక రోజంతా పార్టీ నేతల నుంచి అభిప్రాయాలను సేకరించుకుని ఢిల్లీకి వెళ్లారు. కానీ, అనూహ్యంగా కాంగ్రెస్​ పెద్ద మనిషి, ఏపీ నేత కేవీపీ రామచంద్రారావు ఎంట్రీతో పరిస్థితులు మారిపోయాయని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. గురువారం వరుస భేటీల తర్వాత శుక్రవారం ఉదయం కేవీపీ ఎంటరయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా దిగ్విజయ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర నేతలకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఆయన పార్టీ పరిస్థితుల్లో భాగస్వాములయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో పలు కీలక అంశాలపై లాబీయింగ్​చేసే కేవీపీ ఒక్కసారిగా ఎంట్రీ ఇవ్వడం పార్టీలో హాట్​టాపిక్‌గా మారింది.

రేవంత్‌కే అనుకూలం

టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డిపై సీనియర్లు తిరుగుబాటు జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. రేవంత్​ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు. సేవ్ కాంగ్రెస్​ నినాదాన్ని ఎత్తుకున్నారు. దీంతో ఏఐసీసీ నుంచి దిగ్విజయ్‌ను దూతగా పంపించారు. రాష్ట్ర పార్టీలో సంక్షేభాన్ని పరిష్కరించే బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి వచ్చిన ఆయన దాదాపుగా రెండు రోజులు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంలోనే శుక్రవారం మీడియాతో మాట్లాడి హస్తినకు వెళ్లిపోయారు. అయితే, పార్టీలోని తిరుగుబాటు ప్రకటించిన సీనియర్లకు సుతిమెత్తగా వార్నింగ్​ఇచ్చారు. పార్టీ అంతర్గత అంశాలపై మీడియా ముందుకు రావొద్దని నేతలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పార్టీ నేతలతో భేటీ తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ తీరును తప్పుపడుతూ నివేదికలు సమర్పించినట్లు సీనియర్లు సంబురపడ్డారు. కానీ, ఇదే సమయంలో ఆయన రేవంత్‌ను వెనకేసుకొచచినట్లుగా మారింది. చిన్న వయస్సు వారికి పీసీసీ ఇస్తే తప్పేమిటి అంటూ ప్రశ్నించి దిగ్విజయ్.. కొత్త వాళ్లకు కూడా గతంలో పీసీసీ పగ్గాలు అప్పగించినట్లుగా చెప్పుకొచ్చారు. దీంతో ఆయన రేవంత్‌ను వెనకేసుకొచ్చినట్లు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

సీనియర్లకు వార్నింగ్​

ప్రస్తుతం పార్టీలో పరిస్థితులన్నీ చక్కబడ్డాయంటూనే నేతలకు దిగ్విజయ్‌సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై నేతలెవరూ బహిరంగంగా మాట్లాడొద్దని, అలా మాట్లాడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఒకవేళ సమస్యలున్నా.. ఆరోపణలు ఏమైనా ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలని సూచించడం సీనియర్లకు మింగుడుపడలేదు. పార్టీలో సీనియర్, జూనియర్ అనే భేదం ఉండదని, పార్టీలో నాయకుల ప్రయోజనాలు ముఖ్యం కాదని, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని బహిరంగంగానే చెప్పుకొచ్చారు. అంతర్గతంగా కొట్లాటలు మానుకుని ప్రజా సమస్యలపై రోడ్డెక్కి పోరాడాలని నేతలకు సూచించారు. ఈ పరిణామాలు పార్టీలోని సీనియర్లకు వార్నింగ్ ఇచ్చినట్లుగా మారింది.

కేవీపీ ఎంటర్.. తిరుగుబాటు లీడర్ల అసంతృప్తి

ప్రస్తుత పరిస్థితులపై హస్తం నేతలు బహిరంగంగా మాట్లాడకున్నా.. ఏపీ నేత కేవీపీ ఎంటర్​ కావడాన్ని తప్పు పడుతున్నారు. ఇటీవల కాలంలో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువగా ఇన్​వాల్వ్​అవుతున్నట్లు భావిస్తున్నారు. అయితే, మొన్నటిదాకా అటు సీనియర్లను, ఇటు రేవంత్​ వర్గానికి కూడా ఆయనే వెనకున్నారనే ధీమాతో ఉన్నారు. మరోవైపు గతం నుంచి ఇప్పటిదాకా అటు బీఆర్ఎస్​అధినేత కేసీఆర్‌తోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయంటూ కాంగ్రెస్​నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్​రావడం, ఆ వెంటనే కేవీపీ కూడా రావడం, ఉదయం నుంచి డిగ్గీ రాజాతో చర్చించడం హాట్​ టాపిక్‌గా మారింది.

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్​రెడ్డా.. సీనియర్లా అనేది తేల్చుకునే సమయంలో కేవీపీ ఎంట్రీ ఇవ్వడంతో సీనియర్ల వర్గానికి కొంత సందిగ్థం నెలకొంది. ఇటీవల రేవంత్ వర్గాన్ని కేవీపీ మరింత దగ్గరకు తీస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దిగ్విజయ్‌తో భేటీ కావడం సీనియర్లకు ఇబ్బందిగా మారింది. మొన్నటిదాకా కేవీపీ జపం చేసిన కొంతమంది సీనియర్​ నేతలు ఇప్పుడు ఆయన రావడంపై అసంతృప్తిని వెళ్లగక్కతున్నారు.

అటు రక్షణ.. ఇటు భరోసా

కాగా, పార్టీ పరిస్థితులపై నివేదిక తయారు చేసుకున్న దిగ్విజయ్.. తన సన్నిహితుడు కేవీపీ వచ్చిన తర్వాత కొంత రేవంత్​వర్గానికి అనుకూలంగా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం తప్పును మాణిక్కం ఠాగూర్​వైపు మళ్లించే ప్లాన్​ కూడా చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాకుండా, దిగ్విజయ్‌తో సమావేశమైన తర్వాత అన్నింటినీ తాను సెట్​చేస్తానంటూ హామీ ఇచ్చారని కాంగ్రెస్‌లోని ఓ కీలక నేత చెప్పారు. రేవంత్​వర్గానికి రక్షణ గోడగా నిలబడుతూనే.. సీనియర్ల బాధ్యత తనదేనని, వివాదాలను సద్దుమణిగిస్తానని డిగ్గీ రాజాకు హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు. దీంతో ఏదో జరుగుతుందని తిరుగుబాటు ఎగురవేసిన సీనియర్లు ఇప్పుడు ఏం చేయాలనే మీమాంసలో పడ్డారు. అటు కేవీపీ నుంచి కూడా ఎలాంటి సమాచారం వస్తుందనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ కేవీపీ ఎంటర్ తర్వాత డిగ్గీరాజా స్వరం మారడం పార్టీ నేతలను ఇరకాటంలోకి నెట్టినట్లు అయింది.

Also Read..

వైఎస్ జగన్, షర్మిల మధ్య పెరిగిన గ్యాప్.. ఇదిగో సాక్ష్యం ..? 

మంత్రుల తీరుపై BRS శ్రేణుల విస్మయం.. కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితపై అసంతృప్తి! 

Tags:    

Similar News