మాఫియా డాన్ కబ్జా భూమిలో పేదలకు ఫ్లాట్లు.. లబ్ధిదారులకు తాళాలు అప్పగించిన ముఖ్యమంత్రి

మాఫియా డాన్ అతీఖ్ అహ్మద్ ప్రయాగ్‌రాజ్‌లోని లుకేర్‌గంజ్ ప్రాంతంలో కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు.

Update: 2023-06-30 11:24 GMT

ప్రయాగ్‌రాజ్‌ : మాఫియా డాన్ అతీఖ్ అహ్మద్ ప్రయాగ్‌రాజ్‌లోని లుకేర్‌గంజ్ ప్రాంతంలో కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు. అందులో 76 ఫ్లాట్లను నిర్మించింది. శుక్రవారం అలహాబాద్ మెడికల్ అసోసియేషన్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ ఫ్లాట్ల తాళాలను నిరుపేద లబ్ధిదారులకు సీఎం యోగి అందజేశారు. ఈ భూమిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద ఫ్లాట్లను నిర్మించామని ఆయన వెల్లడించారు. వీటికి లబ్ధిదారులను జూన్ 9న లాటరీ ద్వారా ఎంపిక చేశామని చెప్పారు.

2017వ సంవత్సరానికి ముందు పేదలు, వ్యాపారులు, ప్రభుత్వ సంస్థల భూములను మాఫియా కబ్జా చేసేదని.. పేదలు నిస్సహాయంగా చూసేవారని యోగి గుర్తు చేశారు. ఆ విధంగా కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుని, ఇప్పుడు తాము పేదల కోసం ఇళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇది గొప్ప విజయమన్నారు. మాఫియా డాన్ అతీఖ్ అహ్మద్ కబ్జా నుంచి విడిపించిన భూమిలో నిర్మించిన ఒక్కో ఫ్లాట్ ఖరీదు రూ.6 లక్షలని, లబ్ధిదారులకు రూ.3.5 లక్షలకే అందజేశామని అధికారులు పేర్కొన్నారు.


Similar News