బీజేపీ కార్యకర్తగా పని చేస్తూనే ఉంటా: అనురాగ్ ఠాకూర్
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో తనకు అవకాశం కల్పించకపోవడంపై మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు.
దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో తనకు అవకాశం కల్పించకపోవడంపై మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. బీజేపీ కార్యకర్తగా పని చేస్తానని, భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పాన్ని నెరవేర్చడానికి దోహదపడతానని చెప్పారు. ఆదివారం ఆయన ఓ మీడియా చానల్తో మాట్లాడారు. మోడీ బృందానికి అభినందనలు తెలిపిన ఆయన ప్రస్తుతం కేబినెట్లో చోటు దక్కించుకున్న వారు ఎంతో సమర్థులని కొనియాడారు. దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఐదుసార్లు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం బీజేపీ ఇచ్చిందని, ఇంతకంటే పెద్ద చాన్స్ నాకు లభించదని అన్నారు.పదవుల కన్నా దేశ ప్రగతి ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలని సూచించారు. మోడీ నాయకత్వంలో దేశం కొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అందులో ఎలాంటి సందేహమూ అవసరం లేదని తెలిపారు.