మణిపూర్‌లో మళ్లీ హింస..జిరిబామ్ జిల్లాలో కర్ఫ్యూ

లోక్ సభ ఎన్నికలు ముగిసిన అనంతరం మణిపూర్‌లో మరోసారి హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. జిరిబామ్ జిల్లాలో మైతీ వర్గానికి చెందిన సోయిబమ్ శరత్‌కుమార్ (59) అనే వ్యక్తిని కుకీ మిలిటెంట్లు హత్య చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

Update: 2024-06-08 03:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలు ముగిసిన అనంతరం మణిపూర్‌లో మరోసారి హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. జిరిబామ్ జిల్లాలో మైతీ వర్గానికి చెందిన సోయిబమ్ శరత్‌కుమార్ (59) అనే వ్యక్తిని కుకీ మిలిటెంట్లు హత్య చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. శరత్‌ తన పొలం నుంచి తిరిగి వస్తుండగా అదృశ్యమయ్యాడని, శరీరంపై పదునైన వస్తువుతో పొడిచినట్టు గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ హత్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుకీ మిలిటెంట్లు హింసకు పాల్పడ్డారు. స్థానికంగా ఉండే ఇళ్లను తగులబెట్టారు. ఈ నేపథ్యంలో జిరిబామ్ జిల్లా మేజిస్ట్రేట్ తదుపరి అల్లర్లను నిరోధించడానికి జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు.

ఘటనా ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించాలని ఎస్పీని ఆదేశించారు. ఈ హింసాత్మక పరిస్థితుల అనంతరం భయాందోళనకు గురైన మెయితీ ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి పాఠశాలల్లో ఆశ్రయం పొందారు. అస్సాం రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, మణిపూర్ పోలీస్, ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ అధికారులతో కూడిన జాయింట్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు మణిపూర్ హింసాకాండకు కీలకమైన నిందితుడు థోంగ్‌మింథాంగ్ హౌకిప్ అలియాస్ తంగ్‌బోయ్ హాకిప్ అలియాస్ రోజర్‌ని జూన్ 6న ఇంఫాల్ విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. అతనిపై గతేడాది జూలై 18న ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది.

కాగా, గతేడాది మే నుంచి మణిపూర్‌లో కుకీ, మెయితీ వర్గాల మధ్య అల్లర్లు జరుగుతున్నాయి. ఈ జాతి ఘర్షణలో ఇప్పటి వరకు సుమారు 200 మందికి పైగా మరణించగా..వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ హింస కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 


Similar News