Delhi drug bust: ఢిల్లీ డ్రగ్స్ కేసుపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ డ్రగ్స్ కేసు గురించి ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.5 వేల కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ లో కాంగ్రెస్ నేత పేరు ఉండటంపై మోడీ మండిపడ్డారు.

Update: 2024-10-05 11:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ డ్రగ్స్ కేసు గురించి ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.5 వేల కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ లో కాంగ్రెస్ నేత పేరు ఉండటంపై మోడీ మండిపడ్డారు. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మోడీ కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. దేశంలోని యువతను డ్రగ్స్ కు బానిస చేయాలని చూస్తోందని ఫైర్ అయ్యారు. డ్రగ్స్ దందా వల్ల వచ్చే డబ్బుని ఎన్నికల్లో వాడాలని యోచిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఎన్నికలు గెలవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు మండిపడ్డారు. ఇకపోతే, అక్టోబర్ 2న దక్షిణ ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లోని ఓ గోడౌన్‌లో ఢిల్లీ పోలీసులు 560 కిలోల కొకైన్, 40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.5620 కోట్లగా అంచనా వేశారు.

ఐదుగురు అరెస్టు

ఢిల్లీ డ్రగ్స్ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు తుషార్ గోయల్‌కి కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. అయితే, కాంగ్రెస్ మాత్రం తుషార్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. తుషార్ గోయల్ గతంలో 2022 వరకు ఢిల్లీ పీసీసీ ఆర్టీఐ సెల్ చైర్మన్‌గా పనిచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడి సోషల్ మీడియా ప్రొఫైల్‌లో ఇప్పటికీ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ ఆర్టీఐ సెల్ ఛైర్మన్ అని ఉంది. కాగా.. 2022లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయన్ని పార్టీ బహిష్కరించినట్లు కాంగ్రెస్ పేర్కొంది. అప్పట్నుంచి తుషార్ తో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని హస్తం పార్టీ ప్రకటించింది. కానీ, బీజేపీ మాత్రం కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తుంది.


Similar News