ఢిల్లీ డ్రగ్ రాకెట్ పై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

ఇటీవల ఢిల్లీలో భారీగా పట్టుబడిన డ్రగ్స్ పై కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో కాంగ్రెస్ కు చెందిన నేత ఉండటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

Update: 2024-10-04 08:08 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ఢిల్లీలో సుమారు 5 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్ రాకెట్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ యువతే టార్గెట్ గా చేసుకుని డ్రగ్స్ దందా చేస్తోందని, యువతను చీకటి ప్రపంచంలోకి నెడుతోందని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన ఒక పోస్ట్ చేశారు. మాదకద్రవ్య రహిత భారత్ ను నిర్మించేందుకు మోదీ సర్కార్ జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోన్న వేళ.. ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడటం, ఇందులో కాంగ్రెస్ నేత ప్రమేయం ఉండటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో 500 కేజీలకు పైగా కొకైన్, 40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నాక.. నిందితుడు తుషార్ గోయల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

తమ సర్కార్ యువతను విద్య, క్రీడలు, ఆవిష్కరణలవైపు నడిపించేందుకు కృషి చేస్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ మాత్రం తన రాజకీయ ప్రభావాన్ని వాడుకుంటోందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లోనూ డ్రగ్స్ దందా యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ డ్రగ్స్ ప్రపంచానికి యువతను బానిసలుగా చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అలాంటి రాజకీయనాయకుల్ని మోదీ సర్కార్ క్షమించబోదన్నారు. డ్రగ్ నెట్ వర్క్ ను పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నామని అమిత్ షా స్పష్టం చేశారు. 


Similar News