15 రోజుల్లో ఎన్డీయేలోకి ఉద్ధవ్ థాక్రే..మహారాష్ట్ర ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోడీ మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన 15 రోజుల్లో శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఎన్డీయేతో కలుస్తారని మహారాష్ట్రలోని అమరావతి ఎమ్మెల్యే రవి రాణా వ్యాఖ్యానించారు.

Update: 2024-06-03 07:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన 15 రోజుల్లో శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఎన్డీయేతో కలుస్తారని మహారాష్ట్రలోని అమరావతి ఎమ్మెల్యే రవి రాణా వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన అమరావతి జిల్లా బద్నేరాలో మీడియాతో మాట్లాడారు. ‘ఉద్ధవ్ త్వరలోనే మోడీ ప్రభుత్వంతో కలుస్తారు. ఎందుకంటే రాబోయే యుగం మోడీదే. ఈ విషయం ఉద్ధవ్‌కు స్పష్టంగా తెలుసు’ అని అన్నారు. ఉద్ధవ్, సంజయ్ రౌత్‌ల మాటతీరు చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) నాయకులు తమ వద్ద బీపీ, ఇతర మందులు, వైద్యులను తమ వద్ద ఉంచుకోవాలని, ఎందుకంటే వారిలో చాలా మంది లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున అస్వస్థతకు గురవుతారని ఎద్దేవా చేశారు. తన సతీమణి నవనీత్ రాణా అమరావతి లోక్‌సభ స్థానంలో రెండు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. నవనీత్ రాణా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు.


Similar News