Rajasthan: అజ్మీర్ లో రైలు ప్రమాదానికి భారీ కుట్ర
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రైలు ప్రమాదానికి జరిగిన కుట్ర మరువక ముందే అలాంటి ఘటనే మరోటి జరిగింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రైలు ప్రమాదానికి జరిగిన కుట్ర మరువక ముందే అలాంటి ఘటనే మరోటి జరిగింది. రాజస్థాన్ (Rajasthan)లోని అజ్మీర్ (Ajmer)లో రైలు ప్రమాదానికి భారీ కుట్ర జరిగింది. పూలేరా – అహ్మదాబాద్ మార్గంలో రైల్వే ట్రాక్పై దుండగులు సుమారు 70 కిలోల బరువైన రెండు సిమెంట్ దిమ్మెలను (cement block) ఉంచారు. రైలు సిమెంట్ దిమ్మెను ఢీ కొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో రైలు ఇంజిన్తోపాటు కొంత భాగం దెబ్బతిన్నది. ఈ ఘటనపై లోకో పైలట్ ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రమాద ప్రాంతంలో విరిగిన సిమెంట్ దిమ్మెల భాగాలను గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఈ ఘటన ఆదివారం రాత్రి 10.30 గంటలకు జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాన్పూర్ లో రైలు ప్రమాదానికి కుట్ర
ఇకపోతే, రెండ్రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో కాళిందీ ఎక్స్ ప్రెస్ కు పెద్ద ప్రమాదం తప్పింది. ట్రాక్పై ఉంచిన గ్యాస్ సిలిండర్ను రైలు ఢీకొంది. అయితే రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలును పట్టాలు తప్పించడానికి జరిగిన కుట్రగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలిలో ఒక పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ అధికారి చెప్పారు.