Junk food: వాటికి పిల్లలు బానిసలు అవుతున్నారు.. చర్యల కోసం రాజ్యసభలో బీజేపీ ఎంపీ విజ్ఞప్తి
జంక్ఫుడ్పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ విజ్ఞప్తి చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న జంక్ ఫుడ్ (Junk Food) వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ సుజీత్ కుమార్ (BJP MP Sujeet Kumar) కోరారు. జంక్ ఫుడ్ వినియోగంతో దేశంలో నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులు రెట్టింపయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ రాజ్యసభలో (Rajya Sabha) ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. ప్యాకేజ్డ్ ఫుడ్కు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయాలని, ప్రజలు జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా వారిని నిరుత్సాహపరిచేలా అదనపు పన్ను విధించాలని కోరారు. జంక్ ఫుడ్ ఉత్పత్తి సంస్థలు చేస్తున్న వాణిజ్య ప్రకటనలు మన పిల్లలను వాటికి బానిసలుగా మారుస్తున్నాయని ఆరోపించారు.