16 మంది పిల్లలను కనండి!

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సామూహిక వివాహ కార్యక్రమంలో 16 మంది పిల్లలను కనండనే కామెంట్ చేశారు.

Update: 2024-10-21 13:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సామూహిక వివాహ కార్యక్రమంలో 16 మంది పిల్లలను కనండనే కామెంట్ చేశారు. 31 నవ దంపతులను ఉద్దేశిస్తూ.. ‘మన సాంప్రదాయంలో నవ దంపతులు 16 రకాల సంపదలు పొందాలని కుటుంబ పెద్దలు ఆశీర్వదించేవారు. 16 రకాల సంపదలు పొంది సుసంపన్న జీవితాన్ని అనుభవించాలని చెప్పేవారు. 16 మంది పిల్లలను కనాలని చెప్పడం వారి ఉద్దేశ్యం కాదు. కానీ, నిజంగానే తాము 16 మంది పిల్లలను కనడం మంచిదేమో అనే పరిస్థితులు నేడు తలెత్తాయి. తాము నిజంగా చిన్న కుటుంబమో, సుసంపన్న కుటుంబాన్నో కోరుకోకపోవడం బెటర్ అనే ఆలోచనలు వస్తున్నాయి’ అని వివరించారు. డీలిమిటేషన్ నేపథ్యంలో సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

2029 లోక్ సభ ఎన్నికలకు ముందు జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాల్సి ఉన్నది. ఈ పునర్వ్యవస్థీకరణ తర్వాత 2026లో ప్రస్తుతమున్న 543 లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య 753కు పెరుగుతుంది. అత్యధిక జనాభా గల రాష్ట్రం యూపీలో 80 నుంచి 126కు సీట్లు పెరుగొచ్చు. దక్షిణాదిలో కర్ణాటకలో మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో అంటే 28 నుంచి 36 సీట్లకు పెరిగే చాన్స్ ఉన్నది. తమిళనాడులో 39 నుంచి 41కి, ఏపీ, తెలంగాణల్లో మూడు సీట్లు పెరిగే అవకాశం ఉన్నది. ఇక జనాభా నియంత్రణను సమర్థవంతంగా చేపట్టిన కేరళలో 20 సీట్లలో నుంచి ఒకటి తగ్గే ముప్పూ ఉన్నది. బీజేపీకి అనుకూలమైన ఉత్తరాదిలో ఎంపీ సీట్ల సంఖ్య పెరగడం, జనాభా నియంత్రణను మెరుగ్గా పాటించిన రాష్ట్రాలకు పెరగకపోవడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జనాభా కట్టడి పాటించని రాష్ట్రాలకు ఎంపీ సీట్ల రూపంలో రివార్డ్ ఇవ్వడం ఏ మేరకు సమంజసం అనే ప్రశ్నలు వేస్తున్నాయి.

Tags:    

Similar News