Court: ‘మహిళా డాక్టర్లు రాత్రివేళల్లో పని చేయకుండా అడ్డుకోలేరు’

మాహిళా డాక్టర్లను రాత్రిపూట డ్యూటీ చేయకుండా ఆపలేరని సుప్రీంకోర్టు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది

Update: 2024-09-17 12:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మాహిళా డాక్టర్లను రాత్రిపూట డ్యూటీ చేయకుండా ఆపలేరని సుప్రీంకోర్టు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల మాహిళా డాక్టర్లను రాత్రిపూట డ్యూటీలో పెట్టవద్దని ప్రభుత్వ ఆసుపత్రులకు బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మంగళవారం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో వైద్యురాలిపై అత్యాచారం, హత్యపై సుమోటోగా విచారణ చేపట్టిన కోర్టు విచారణ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ, మహిళలు రాత్రిపూట పని చేయలేరని మీరు ఎలా చెప్పగలరు? మహిళా వైద్యులను ఎందుకు పరిమితం చేస్తారు? వారికి మినహాయింపులు అవసరం లేదు, పురుషులతో పాటు వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలి. మహిళలు అన్ని పరిస్థితుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, పైలట్లు, ఆర్మీ సిబ్బంది, ఇతరులు రాత్రి సమయంలో పని చేస్తారు, వారికి సరైన భద్రతా చర్యలు అందించడమే సమస్యకు పరిష్కారమని ప్రధాన న్యాయమూర్తి, బెంగాల్ ప్రభుత్వ న్యాయవాది కపిల్ సిబల్‌కి సూచించారు.

ఇదిలా ఉంటే, విచారణలో భాగంగా కపిల్ సిబల్ మాట్లాడుతూ, నిరసనలు చేసిన వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చారని కోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో మమతా బెనర్జీ రాజీనామా చేయాలని కోరుతూ ఒక న్యాయవాది పిటిషన్ దాఖలు చేయగా, సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది, ఇది రాజకీయ వేదిక కాదని, చట్టపరమైన క్రమశిక్షణ నిబంధనలకు కట్టుబడి ఉండాలని హెచ్చరించింది. అలాగే, విచారణ సందర్భంగా, బాధితురాలి పేరును తన ప్లాట్‌ఫారమ్ నుండి తొలగించాలని వికీపీడియాను కోర్టు ఆదేశించింది.


Similar News