కోటాలో నీట్ విద్యార్థిని సూసైడ్..ఈ ఏడాది 11వ ఘటన
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో నీట్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో నీట్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. నీట్ యూజీ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్లోని రేవాకు చెందిన బగీషా తివారీ(18) అనే విద్యార్థిని ఏడాది కాలంగా కోటాలోని జవహర్ నగర్ ప్రాంతంలో తల్లి, సోదరుడితో కలిసి నివాసముంటూ నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం వారు నివాసముండే భవనంలోని ఐదో అంతస్తు నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకుంది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించలేదు. ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 11కు చేరుకుంది. గతేడాది 26 మంది స్టూడెంట్స్ సూసైడ్కు పాల్పడ్డారు.