భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం స్టాక్ మార్కెట్ల పై ప్రతికూల ప్రభావం చూపింది.

Update: 2024-10-03 10:44 GMT

దిశ, వెబ్ డెస్క్ :  దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం స్టాక్ మార్కెట్ల పై ప్రతికూల ప్రభావం చూపింది. యుద్ద ప్రభావంతో ఒక్కరోజులోనే 11 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ 1769 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 82497దగ్గర ముగిసింది. నిఫ్టీ 546 పాయింట్లు కోల్పోయి 22,250 పాయింట్లు దగ్గర ముగిసింది. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకొనడం గ్లోబల్ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. భారత ఈక్విటీ మార్కెట్లలోనూ ఈ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవాళ (గురువారం) భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ఆరంభమయ్యాయి. ఈ క్రమంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ రెండు శాతానికిపైగా పడిపోగా.. దాదాపు రూ.11లక్షలకోట్లకుపైగా మదుపరుల సంపద ఆవిరైంది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో ముడి చమురు ధరలు పెరిగాయి. ఇక బీఎస్‌ఈలో లిస్ట్‌ అయిన అన్ని కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.5.63లక్షల కోట్లు తగ్గి రూ.469 కోట్లకు పడిపోయింది. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 83,002.09 మొదలైంది. మొదట్లోనే 1,250 పాయింట్లకుపైగా నష్టాల్లో ట్రేడింగ్‌ మొదలైంది. ఆ తర్వాత మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో 82,434.02 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 1,769.19 పాయింట్ల నష్టంతో 82,497.10 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 546.80 పాయింట్లు పతనమై.. 25,250.10 వద్ద ముగిసింది.

ఇటీవల వరుస లాభాలతో స్టాక్‌ మార్కెట్లు కొత్త రికార్డులను సృష్టిస్తూ వచ్చాయి. దాదాపు రెండు నెలల అనంతరం పతనమయ్యాయి. ట్రేడింగ్‌లో దాదాపు 1,077 షేర్లు పురోగమించగా.. 2740 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో బీపీసీఎల్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్‌జీసీ లాభపడ్డాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. రియాల్టీ 4.5 శాతం, ఆటో, బ్యాంక్, మీడియా, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్ ఇండెక్స్ 2నుంచి 3శాతం చొప్పున నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 2శాతం చొప్పున పతనమయ్యాయి. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగొచ్చని, చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడొచ్చనే భయాందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రతికూలంగా మార్చాయి. మార్కెట్లలో పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు మదుపర్లు మొగ్గుచూపారు. చమురు, గ్యాస్, ఉక్కు, బ్యాంకింగ్‌తో పాటు ఇతర రంగాల షేర్లలో అమ్మకాల జోరు కనిపించింది.


Similar News