Bangladesh: తొలిసారి మౌనం వీడిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

తన తొలి ప్రకటనలో జూలైలో జరిగిన హత్యలు, విధ్వంసక చర్యలకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.

Update: 2024-08-13 17:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు కారణంగా దేశం విడిచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా మొదటిసారి మౌనం వీడారు. తన తొలి ప్రకటనలో జూలైలో జరిగిన హత్యలు, విధ్వంసక చర్యలకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. 'ఆగస్టు 15న జాతీయ సంతాప దినాన్ని గౌరవప్రదంగా జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. బంగాబంధు భాబన్‌లో పూల మాలలు వేసి ప్రార్థించడం ద్వారా ఆత్మలందరి మోక్షం కోసం ప్రార్థించండి' అని హసీనా ప్రకటన చేశారు. 'గత జూలై నుంచి ఆందోళనల పేరుతో విధ్వంసం, దహనం, హింస కారణంగా చాలామంది జీవితాలు కోల్పోయారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళా పోలీసులు, పాత్రికేయులు, సాంస్కృతిక కార్యకర్తలు, శ్రామిక ప్రజలు, అవామీ లీగ్, అనుబంధ సంస్థల నాయకులు, కార్మికులు, పాదచారులు, వివిధ సంస్థలలో ఉగ్రదాడిలో మరణించిన కార్మికులకు నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను.' అని ఆమె అన్నారు. ఇదే సందర్భంలో బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ మ్యూజియం ధ్వంసం చేయడాన్ని హసీనా ఖండిస్తూ, 'జాతి పితామహుడు బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్, అతని నాయకత్వంలో మనం స్వతంత్ర దేశంగా ఆత్మగౌరవం, స్వాతంత్ర్యం పొంది, స్వతంత్ర దేశాన్ని సాధించాం. తాజా పరిణామాలకు బాధ్యులైన వారు లక్షలాది మంది అమరవీరుల రక్తాన్ని అవమానించారఅని ఆమె పేర్కొన్నారు. కాగా, బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా 15 ఏళ్ల సుదీర్ఘ పాలన ఆగస్టు 5న తిరుగుబాటు కారణంగా ముగిసింది. ఆమెతో పాటు మరో ఆరుగురిపై బంగ్లాలో కేసు నమోదు చేశారు. 

Tags:    

Similar News