Kolkata: రాయ్‌కు బెయిల్ ఇవ్వమంటారా? సీబీఐ న్యాయవాదిపై కోర్టు ఆగ్రహం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ హత్యాచార ఘటనపై కోల్‌కతా కోర్టు విచారణ జరుపుతుంది.

Update: 2024-09-07 06:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ హత్యాచార ఘటనపై కోల్‌కతా కోర్టు విచారణ జరుపుతుంది. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ తరఫున న్యాయవాది ఆలస్యంగా రావడంపై కోర్టు సీరియస్ అయింది. నిందితుడు సంజయ్ రాయ్‌కి బెయిల్ మంజూరు చేయాలా? అని న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 4.20 గంటలకు విచారణ ప్రారంభం కాగానే డిఫెన్స్ లాయర్ కవిత సర్కార్ తన వాదనలు ప్రారంభించారు. అయితే, సీబీఐ న్యాయవాది దీపక్ పోరియా ఇంకా హల్‌లోకి రాలేదని న్యాయమూర్తి గుర్తించారు. అలాగే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా రాలేదు. విచారణ ప్రారంభమైన సుమారు 50 నిమిషాలు లేట్‌గా సీబీఐ న్యాయవాది వచ్చారు.

ఆలస్యం కావడం పట్ల విసిగిపోయిన అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, " సంజయ్ రాయ్‌కి బెయిల్ మంజూరు చేయాలా? ఇది సీబీఐ తీవ్ర అలసత్వ ధోరణికి నిదర్శనం. ఇది చాలా దురదృష్టకరం" అని అన్నారు. తర్వాత విచారణ ప్రారంభం అయిన వెంటనే రాయ్ తరపు న్యాయవాది కవిత సర్కార్ బెయిల్ కోసం వాదిస్తూ, సంజయ్‌ రాయ్‌కు ఎలాంటి నేర చరిత్ర లేదని, సీబీఐ తగిన ఆధారాలు సమర్పించలేదని పేర్కొంది. సీబీఐ న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, నిందితుడిని విడుదల చేస్తే దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని అన్నారు. నిందితుడు సంజయ్ రాయ్ ఆగస్టు 10న అరెస్టయ్యాడు. అతన్ని సెప్టెంబర్ 20 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు.


Similar News