Sexual assault: పాఠశాల విద్యార్థినులపై లైంగిక దాడి.. మహారాష్ట్రలో దారుణం!

మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. థానే జిల్లాలోని బద్లాపూర్‌లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై లైంగిక దాడి ఘటన వెలుగు చూసింది. దీంతో ఆగ్రహించిన ప్రజలు మంగళవారం తీవ్ర నిరసన తెలడంతో

Update: 2024-08-20 15:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. థానే జిల్లాలోని బద్లాపూర్‌లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై లైంగిక దాడి ఘటన వెలుగు చూసింది. దీంతో ఆగ్రహించిన ప్రజలు మంగళవారం తీవ్ర నిరసన తెలడంతో మహారాష్ట్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే..బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు నర్సరీ విద్యార్థినులపై ఈ నెల 16న పాఠశాల అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. టాయిలెట్‌కు వెళ్లిన విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించారు. అయితే పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన విద్యార్థినులు మరుసటి రోజు స్కూల్‌కు వెళ్లడానికి నిరాకరించడంతో పాటు ప్రయివేట్ పార్ట్స్‌లో నొప్పిగా ఉందని తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

అయితే ఈ ఘటనపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహిస్తూ.. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర నిరసన తెలిపారు. బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాలపై కూర్చుని ఆందోళన చేపట్టారు. సుమారు 9 గంటలకు పైగా ట్రాక్‌పైనే కూర్చుని నినాదాలు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉదయం 10గంటలకు ప్రారంభమైన ధర్నా సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది. నిరసనల వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన కారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించగా..ప్రజలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది. మరి కొంత మంది పాఠశాల గేటు, కిటికీ అద్దాలు, బెంచీలు, తలుపులు పగలగొట్టినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం పాఠశాల ప్రిన్సిపల్‌తో పాటు, ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్‌తో సహా ముగ్గురు పోలీసు అధికారులను సైతం విధుల నుంచి తొలగించింది.

సిట్ ఏర్పాటు

బద్లాపూర్‌లో జరిగిన లైంగిక వేధింపుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. దీనిపై మరింత దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీ చేసి త్వరగా విచారణ చేపడతామని తెలిపారు. ఐజీ ర్యాంకు మహిళా అధికారి నేతృత్వంలో విచారణ జరపనున్నట్టు చెప్పారు. అంతేగాక సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా మహారాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

Tags:    

Similar News