Road accident: ట్రక్కు ఆటో ఢీకొని ఏడుగురు మృతి.. మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు ఆటో ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

Update: 2024-09-19 09:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, ఆటో ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెహోర్-మజ్‌గవాన్ రహదారిలోని లుంజీ గ్రామ సమీపంలో ఓ భారీ ట్రక్కు ఆటోను ఢీకొట్టింది. అనంతరం సుమారు 100 మీటర్ల దూరం వరకు లాక్కెల్లింది. దీంతో ఏడుగురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించగా..11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ట్రక్కు కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని సిహోరా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను శోభరామ్ (35), ఉషా బాయి (50), శివకుల్ (18), కల్లు బాయి (30), కరణ్ రాను కోల్ (19), కరణ్ (20), చిన్నా (3)గా గుర్తించారు. మృతులు, క్షతగాత్రులు అందరూ ప్రతాపూర్‌ గ్రామానికి చెందినవారేనని తెలిపారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 


Similar News