Hoax Bomb Threats : ఫేక్ బాంబు బెదిరింపు‌లపై కేంద్రం సీరియస్.. సోషల్ మీడియా కంపెనీలకు అడ్వైజరీ

దిశ, నేషనల్ బ్యూరో : విమానయాన సంస్థలకు గత 13 రోజుల వ్యవధిలో వందలాదిగా ఫేక్ బాంబు బెదిరింపులు(hoax bomb threats) వచ్చిన అంశంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది.

Update: 2024-10-26 12:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో : విమానయాన సంస్థలకు గత 13 రోజుల వ్యవధిలో వందలాదిగా ఫేక్ బాంబు బెదిరింపులు(hoax bomb threats) వచ్చిన అంశంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఆకతాయిలు పెట్టే ఫేక్ బెదిరింపు మెసేజ్‌లను ఎప్పటికప్పుడు గుర్తించి, తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సోషల్ మీడియా కంపెనీలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ(Centre Govt) ఆదేశించింది. ఫేక్ బెదిరింపు మెసేజ్‌లను ఎప్పటికప్పుడు తొలగించడంలో విఫలమయ్యే సోషల్ మీడియా కంపెనీలను బాధ్యులుగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఈమేరకు మార్గదర్శకాలతో ఒక అడ్వైజరీని శనివారం సోషల్ మీడియా కంపెనీలకు(social media platforms) కేంద్రం జారీ చేసింది. భారత ప్రభుత్వ సమాచార సాంకేతిక(ఐటీ) చట్టాలు, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని నిబంధనలకు కట్టుబడి ఉండాలని వాటికి నిర్దేశించింది.

ఉద్దేశపూర్వకంగా ఉపేక్షించే కంపెనీలపై..

సోషల్ మీడియా కంపెనీల యూజర్లు పోస్ట్ చేసే కంటెంట్‌ను థర్డ్ పార్టీ కంటెంట్‌గా పరిగణిస్తారు. థర్డ్ పార్టీ కంటెంట్ ఆధారంగా సోషల్ మీడియా కంపెనీలపై చర్యలు తీసుకోరాదనే నిబంధన ప్రస్తుత ఐటీ చట్టాలలో ఉంది. ఫేక్ బెదిరింపు మెసేజ్‌లను ఉద్దేశపూర్వకంగా ఉపేక్షించే కంపెనీలపై.. ఈ నిబంధనకు అతీతంగా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఆకతాయిలు పంపుతున్న ఇలాంటి బెదిరింపు సందేశాల వల్ల విమానయాన సర్వీసులకు అంతరాయం వాటిల్లి ఎంతోమంది ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారని పేర్కొంది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఇలాంటి మెసేజ్‌లను ఆకతాయిలు పంపుతున్నారని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ తెలిపింది. చాలామంది సోషల్ మీడియా యూజర్లు ఏ మాత్రం ఆలోచించకుండా ఫేక్ వార్నింగ్ మెసేజ్‌లను ఇతరులకు షేర్ చేస్తుండటాన్ని ఆందోళనకర పరిణామంగా అభివర్ణించింది.

Tags:    

Similar News