స్వర్ణదేవాలయాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంజాబ్ లోని అమృత్సర్లో ఉన్న స్వర్ణదేవాలయాన్ని సోమవారం సందర్శించారు.
అమృత్సర్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంజాబ్ లోని అమృత్సర్లో ఉన్న స్వర్ణదేవాలయాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అకల్ తఖ్త్ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారారు. అనంతరం వలంటీర్గా సేవల్లో పాల్గొని భక్తులు తినడానికి ఉపయోగించిన గిన్నెలను రాహుల్ శుభ్రం చేశారు. సిక్కులు సంప్రదాయబద్ధంగా ధరించే స్కార్ఫ్ను.. ఆయన తలకు చుట్టుకొని కనిపించారు.
రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన కోసం అమృత్సర్కు వచ్చారని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ వెల్లడించారు. కాగా, కొంతకాలంగా పంజాబ్లో కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 2015 నాటి డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరా ప్రస్తుతం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసు విషయంలో కాంగ్రెస్-ఆప్ మధ్య గొడవ చెలరేగుతున్న సమయంలోనే రాహుల్ పంజాబ్లో పర్యటిస్తుండడం గమనార్హం.