Bangladesh: బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై రాహుల్ గాంధీ ఆందోళన

బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు మంగళవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు

Update: 2024-08-06 14:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు మంగళవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం వెనక విదేశీ కుట్ర ఏమైనా ఉందా..? ప్రత్యేకించి పాకిస్థాన్-చైనా పాత్ర ఉందా అని ప్రశ్నించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితిపై భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను సభ్యులకు వివరించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు భారతీయులను తరలించే విధంగా లేవని, పరిస్థితి అదుపులో ఆయన చెప్పారు. బంగ్లాదేశ్‌లో దాదాపు 12,000 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని, దాదాపు 8,000 మంది భారతీయులు ఇప్పటికే దేశానికి తిరిగి వచ్చారని, ఇంకా బంగ్లాదేశ్‌లో ఉన్న వారి భద్రత కోస తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు జైశంకర్ తెలిపారు.

ఆర్జేడీ సభ్యులు మాట్లాడుతూ, మైనారిటీలు, భారతీయుల భద్రత పరంగా అన్ని చర్యలను తీసుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సరిహద్దు వద్ద తగిన భద్రతను పెంచాలని కోరారు. ఇదిలా ఉంటే ఈ సమావేశంలో షేక్ హసీనా గురించి సభ్యులు అడగగా, ఆమె ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నారని మానవత్వ చర్యలో భాగంగానే ఆమెకు భారత్‌లో ఆశ్రయం ఇచ్చామని ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రస్తుతం ఆమె ఇండియాలో ఉన్నప్పటికి తర్వాత మరో ప్రదేశానికి వెళతారా లేదా ఇక్కడే ఉంటారా అనేది స్పష్టంగా తెలియలేదు.

Tags:    

Similar News